ఒకనాడు తిండికిలేక ఆకలి చావులకు నిలయమైన ఈ నేల
ఇయ్యాల పుట్లకొద్దీ వడ్లు పండిస్తూ అన్నపూర్ణగా మారింది.
బోరు పొక్కల్ల నీళ్లు రాక కన్నీళ్లు దుంకిన కండ్లు
ఇవ్వాళ కాళేశ్వరం కాలువలతో, కడుపునిండా కరెంటుతో
రెండు పంటలు తీస్తుంటే ఆనందంతో చెమ్మగిల్లుతున్నయి
ఒకనాడు బతుకు మీదనే ఆశ కోల్పోయిన రైతు
ఇయ్యాల రైతు‘బంధువు’గా మారి ఊరికే భరోసా ఇస్తుండు..
తాగునీళ్ల కోసం తండ్లాడిన పల్లెలు, తండాలు ఇయ్యాల
భగీరథ నల్లాలల్ల గోదావరి నీళ్లతో తానమాడుతున్నయి..
సావు తానం కోసం కూడా బతిమిలాడించుకున్న
కరెంటు ఇయ్యాల పొమ్మన్నా పోతలేదు..
ఒకనాడు ఊర్లల్ల బతుకు లేక బొంబాయి, దుబాయికి
బతుకపోయిన ఊళ్ళల్లకే ఇయ్యాల బయిటి రాష్ట్రపోల్లు
నాట్లేసే కాలం వొచ్చింది..
సర్కారు సొమ్మంతా ఆంధ్రకు తరలిపోతుంటే
మనకు బాకీ లేదనుకున్న రోజునుంచి
ఇయ్యాల సర్కారే ఆసరా అయి పెద్ద మనుషులను
కల్యాణలక్ష్మి పడుచుపిల్లలను
కేసీఆర్ కిట్టయి సంటి పిల్లలను
గావురంగా సూసుకుంటుంటే
తెలంగాణ వచ్చినంక జెర తెల్లవడ్డమనిపిస్తున్నది..
మీరెట్ల బతుకుతరు ఆగమైపోతరన్న పాలోల్ల ముంగట
నిటారుగా నిలబడి అందరికంటే ముందువడుతుంటే
ఆ మురిపెం చెప్పొస్తలేదు. ఇదంతా ఉత్తగ కాలే…
పాణం పణంగ పెట్టి ప్రత్యేక రాష్ట్రం
కావాలని కొట్లాడిన బిడ్డలే పాలకులై
ఒక్కొక్క ఇటుకను పేర్చి తెలంగాణను తలెత్తుకునేల నిలబెట్టిన్రు…
ఒకనాడు తన పేరు సుత చెప్పుకోలేక వెనకబడ్డ తెలంగాణ
ఇయ్యాల వెన్ను విరిచి దేశానికే దారిచూపే దీపమైంది..
తన గడ్డమీద ఆత్మగౌరవం కోసం తండ్లాడిన తెలంగాణ
ఇయ్యాల ఢిల్లీ కోట మీద జెండా ఎగరేసేంత ఎత్తుకు ఎదిగింది…
సంక్షోభ సమయంలో భారత ఆర్థికవ్యవస్థను పట్టిలేపిన
పీవీ వారసత్వాన్ని అందిపుచ్చుకొని..
విద్వేషపూరిత రాజకీయాలకు విరుగుడుగా
భారత వికాసానికై పున్నమి వెలుగుల్ని పూయించే
‘చంద్రో’దయాన్ని స్వాగతిద్దాం..
ఎనిమిదేండ్ల చిరుప్రాయంలోనే ఎన్నో అద్భుతాలు
ఆవిష్కరించిన తెలంగాణ మాడల్ను అనుసరిద్దాం.
మంటికైనా ఇంటోడుండల్నానే సామెతను నిజం చేస్తూ
ఢిల్లీ కోటలో తెలంగాణను ఎత్తి పడుతున్న
కేసీఆర్ అడుగులో అడుగేద్దాం..
విశ్వ వినువీధుల్లో బంగారు భావి భారతాన్ని ఆవిష్కరిద్దాం..
-మాదాసు శ్రీనివాస్, 9989178900