స్వాతంత్రోద్యమంలో నిజాంకు వ్యతిరేకంగా పోరాడి, స్వాతంత్య్రానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా భూసంస్కరణల చట్టాన్ని ప్రవేశపెట్టి సంచలనం సృష్టించిన పీవీ నరసింహారావు మన దేశ ప్రధానమంత్రిగా చేసిన మేలు ఇంతా అంతా కాదు. ఆయన ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టకుంటే మన దేశం ఈపాటికి మరో అఫ్ఘానిస్థాన్ అయ్యేది. నెహ్రూ తరం నుంచి రాజీవ్గాంధీ వరకు దేశ రాజకీయాలను కాచి వడబోచిన పీవీ నరసింహారావు ఒక దశలో ఇందిరా గాంధీకి పాలనా వ్యవ హారాలలో మహామంత్రి తిమ్మరుసు వలె వ్యవహరించారు.
ఇప్పటివరకు భారతరత్న పురస్కారం అందుకున్నవారి జాబితాలో కొందరితో పోలిస్తే పీవీ నరసింహారావు భారత రత్న పురస్కారానికి నూటికి నూరు పాళ్ళు అర్హులని చెప్పాలి. ఈ పురస్కారాలను అందించడంలో జరిగిన రాజకీయాలు సామాన్యులకు తెలియనివి కావు. 1977లో కె.కామరాజ్కు ఈ పురస్కారాన్ని ఇవ్వాలని ఇందిరా గాంధీ నిర్ణయించడం తమిళ ఓటర్లను ప్రభావితం చేయడానికేనని జనం చెప్పుకొన్నారు. 1988లో చలనచిత్ర నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్కు భారతరత్న ప్రకటించడం త్వరలో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయడానికే అని అప్పటి ప్రధాని రాజీవ్గాంధీపై విమర్శలు వచ్చాయి. 1992లో బాబ్రీమసీదు కూల్చివేత ఉదంతంలో పీవీ నిర్దోషిత్వం నిరూపితమైనప్పటికీ, భారతరత్న పురస్కారానికి అయోధ్య ఘటనే కారణంగా నాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, నేడు నరేంద్ర మోదీ నాయకత్వం అంతరాంతరాల్లో మల్లగుల్లాలు పడటమే కారణమని సామాజిక తత్వవేత్తలు భావిస్తున్నారు. అయోధ్య ఘటనకు ప్రధాన కారణమైన నాటి యూపీ సీఎం కీ.శే.కల్యాణ్సింగ్ రెండవ అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్కు అర్హుడైనపుడు, నిర్దోషి అయిన పీవీ భారతరత్నకు ఎందుకు అర్హుడు కాదనేది సామాన్యుల ప్రశ్న..
పీవీ శత జయంత్యుత్సవాల సందర్భంగా గతేడాది సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పీవీకి భారతరత్న ఇవ్వాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. కానీ మోదీ హృదయం మోడు వారింది పీవీకి పూర్వం ఎందరో తిలక్, ఠాగోర్, గాంధీ, మొదలైన మహనీయులకు భారతరత్న అందాల్సి ఉండె. కారణాలనేకం. కర్ణుని చావుకు శాపాలెన్నో అన్నట్లు.. ఏదేమైనా పీవీకి మాత్రం ‘భారతరత్న’ ఓ ఎండమావిగానే మిగిలిపోవడం బాధాకరం.
డాక్టర్ వి.వి.రామారావు, 9849237663
(వ్యాసకర్త: ఆకాశవాణి ప్రయోక్త)