న్యూఢిల్లీ: ఢిల్లీ కొత్త ఎక్సైజ్ విధానంలో అవకతవకలు జరిగిన విషయం తెలిసిందే. ఆ కేసుతో లింకు ఉన్న 35 ప్రదేశాల్లో ఇవాళ ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాను ఈడీ విచారించిన విషయం తెలిసిందే. నిందితుడు సమీర్ మహేంద్రు ఇంట్లోనూ సోదాలు జరుగుతున్నాయి. గురుగ్రామ్, లక్నో, హైదరాబాద్, ముంబై, బెంగుళూరులోనూ ఈడీ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ మాజీ ఎక్సైజ్ కమీషనర్ అరవ గోపీ కృష్ణ ఇంట్లోనూ ఇటీవల ఈడీ సోదాలు చేపట్టింది. కొత్త అబ్కారీ విధానం అమలు జరగకుండా లిక్కర్ మాఫియా అడ్డుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ కేసులో సీబీఐ ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు మనీ ల్యాండరింగ్ కేసును బుక్ చేసే అవకాశాలు ఉన్నాయి.