ముంబై : ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన నోటీస్ ‘డెత్ వారెంట్ కాదని.. రాజకీయ కార్యకర్తలకు ప్రేమలేఖ’ అని రాజ్యసభ సభ్యుడు, శివసేన నేత సంజయ్ రౌత్ విమర్శించారు. మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రి, శివసేన నేత అనిల్ పరాబ్ను విచారణకు రావాలని ఈడీ నోటీసు జారీ చేసింది. ఈ క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బలమైన, అజేయమైన మహా వికాస్ అఘాడి (MVA) విచ్ఛిన్నానికి చేసిన ప్రయత్నాలు అన్నీ విఫలమైన తర్వాత ఇలాంటి ప్రేమలేఖలు పెరిగాయన్నారు. అనిల్ పరాబ్ను బీజేపీ నేతలు లక్ష్యంగా చేసుకున్నారని ఆరోపించారు.
ఆయన నోటీసుకు ప్రతిస్పందిస్తారని, ఈడీకి సహకరిస్తారన్నారు. మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్, ఇతరులపై నమోదైన మనీలాండరింగ్ కేసులో మంగళవారం విచారణకు రావాలని ఈడీ పరాబ్కు నోటీసు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ‘బీజేపీ వ్యక్తి ఈడీ డెస్క్ ఆఫీసర్గా లేదంటే.. బీజేపీ కార్యాలయంలో ఈడీ ఆఫీసర్ పని చేస్తున్నారు’ అని విమర్శించారు. గతంలో బీజేపీకి మిత్రపక్షమైన శివసేన గత ఎన్నికల ఫలితాల అనంతరం మహారాష్ట్రలో ఎన్సీపీ, కాంగ్రెస్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.