న్యూఢిల్లీ : బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న ఈడీ ఎదుట విచారణకు హాజరై, మనీలాండరింగ్ కేసులో వాంగ్మూలం నమోదు చేయాలని ఆదేశించింది. ముంబై ఛత్రపతి శివాజీ మహరాజ్ విమానాశ్రయం నుంచి మస్కట్కు వెళ్తుండగా అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం ఈడీ నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్ను ఈడీ ఇంతకు ముందు రెండుసార్లు ప్రశ్నించింది.
రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్తో పాటు ఆమె పాత్ర సైతం ఉన్నట్లు ఈడీ అనుమానిస్తున్నది. అయితే, ఆమె సాక్షిగా ఈడీ ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లు ఆమె ప్రతినిధి గతంలో తెలిపారు. భవిష్యత్లోనూ విచారణ సంస్థకు సహకరిస్తుందని పేర్కొన్నారు. మనీలాండరింగ్ కేసులతో తనపై వచ్చిన ఆరోపణలు ఈ బాలీవుడ్ బ్యూటీ అక్టోబర్లో ఒక ప్రకటనలో ఖండించింది. ఈ కేసులో జాక్వెలిన్పై ఈడీ లుకౌట్ సర్క్యులర్ (ఎల్ఓసీ) జారీ చేయడంతో ఈ క్రమంలో ఆదివారం ముంబై విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆమెను అడ్డుకున్నారు.
ఆ తర్వాత ఈడీ అధికారులు విమానాశ్రయానికి చేరుకొని.. మస్కట్కు వెళ్లేందుకు అనుమతి నిరాకరించారు. రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన కేసులో ఈడీ ఇటీవల ఢిల్లీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. సుకేశ్ చంద్రశేఖర్, అతని భార్య లీనాతో పాటు మరో ఆరుగురి పేర్లను అందులో ప్రస్తావించింది. సుకేశ్, జాక్వెలిన్కు విలువైన కొన్ని పర్షియన్ పిల్లులు, గుర్రంతో సహా భారీగా ఖరీదైన బహుమతులు ఇచ్చాడని ఈడీ చార్జిషీట్లో పేర్కొంది. ఫోర్టిస్ హెల్త్కేర్ మాజీ ప్రమోటర్ శివిందర్ మోహన్ సింగ్ భార్య అదిథి సింగ్ వంటి ఉన్నత స్థాయి వ్యక్తులతో సహా పలువురిని మోసం చేసినట్లు ఆరోపణలున్నాయి.
ఈ కేసులో మరో బాలీవుడ్ నటి నోరా ఫతేహిని సైతం ఈడీ విచారించింది. జైలులో ఉన్న సమయంలో సుకేశ్ మొబైల్ స్పూఫింగ్ టెక్నాలజీని ఉపయోగించి అక్రమాలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఈడీ సుకేశ్ దంపతులతో పాటు సహ నిందితులు ప్రదీప్ రామ్నానీ, దీపక్ రాంనానీలను అరెస్టు చేసింది. సుకేశ్కు చెందిన పలు ప్రాంతాల్లో దాడులు చేసి నగదుతో పాటు లగ్జరీ కాలర్లను స్వాధీనం చేసుకున్నది.