Election Commission | న్యూఢిల్లీ, అక్టోబర్ 11: వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ర్టాల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ భారీ ఎత్తున సీనియర్ అధికారులను బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో కలెక్టర్లు, పోలీస్ అధికారులు ఉన్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) రాజీవ్కుమార్ బుధవారం ఎన్నికల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్ష సమావేశం అనంతరం అధికారుల బదిలీ నిర్ణయాన్ని వెలువరించారు. ఈ సమీక్షలో సున్నితమైన మార్గాలు, ఆయా జోన్లపై తీవ్రంగా చర్చించారు. ఈ ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో మద్యం, నగదు, డ్రగ్స్, ఉచిత బహుమతుల పంపిణీని నిరోధించాలని ఆయన స్పష్టం చేశారు. స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణ పేరిట అధికారులను బదిలీ చేయడం సాధారణమే. ఐదు రాష్ర్టాల పరిధిలో బదిలీ అయిన వారిలో తొమ్మిది మంది జిల్లా కలెక్టర్లు, 25 మంది పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు ఉన్నారు. తెలంగాణలో రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాల కలెక్టర్లు, మధ్యప్రదేశ్లో రట్లాం, ఖార్గోనే, రాజస్థాన్లో అల్వార్, ఛత్తీస్గఢ్లో రాయిగఢ్, బిలాస్పూర్ కలెక్టర్లను బదిలీ చేశారు. బదిలీ వేటు పడిన 25 మంది పోలీస్ అధికారుల్లో 13 మంది తెలంగాణకు చెందిన వారున్నారు. మధ్యప్రదేశ్ నుంచి ఇద్దరు (జబల్పూర్, భిండ్), ఛత్తీస్గఢ్ నుంచి ఇద్దరు అదనపు ఎస్పీలు (బిలాస్పూర్, దుర్గ్), మిజోరం నుంచి ఇద్దరు (చంపాయి, సైహా), రాజస్థాన్ నుంచి ముగ్గురు (హనుమాన్గఢ్, చురు, భీవాడీ) ఉన్నారు.
డ్రగ్స్, ఆయుధ రవాణాను ఆపాలి
హర్యానా, పంజాబ్, రాజస్థాన్ రాష్ర్టాలకు అక్రమ మద్యాన్ని తరలిస్తున్నారని, దీనిని నిరోధించాలని రాజీవ్ కుమార్ సూచించారు. రాజస్థాన్ సరిహద్దు జిల్లాలకు గుజరాత్ నుంచి మద్యాన్ని తరలిస్తున్నారని తెలిపారు. అంతర్జాతీయ సరిహద్దులున్న రాజస్థాన్, మిజోరంలో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), అస్సాం రైఫిల్స్ నిత్యం నిఘా వేసి ఉంచాలని సూచించారు.
తెలంగాణలో 20 మంది అధికారుల బదిలీ తెలంగాణలో మొత్తం 20 మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీచేసింది. బదిలీ అయిన వారిలో 13 మంది పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, నలుగురు కలెక్టర్లు, ముగ్గురు ఇతర శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు. వీరిలో రవాణాశాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, ఎక్సైజ్ డైరెక్టర్ ముషారఫ్ అలీ, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ శ్రీదేవి ఉన్నారు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్కుమార్, యాదాద్రి కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డితోపాటు హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లు సీవీ ఆనంద్, రంగనాథ సత్యనారాయణ.. సంగారెడ్డి, కామారెడ్డి, జగిత్యాల, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, గద్వాల్, మహబూబాబాద్, భూపాలపల్లి, నారాయణపేట, సూర్యాపేట ఎస్పీలు రమణకుమార్, శ్రీనివాస్రెడ్డి, భాస్కర్, కే నర్సింహ, మనోహర్, సృజన, చంద్రమోహన్, కరుణాకర్, వెంకటేశ్వర్లు, రాజేంద్రప్రసాద్ను బదిలీ చేసింది. వీరి స్థానాల్లో ఇతర అధికారుల నియామకం కోసం ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పన అధికారుల పేర్లతో అవసరమైన జాబితాను గురువారం సాయంత్రంలోగా అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. బదిలీ చేసిన అధికారులను ఎన్నికల విధులతో సంబంధం లేని పోస్టుల్లో నియమించనున్నారు.
బదిలీ అయినవారి స్థానంలో వచ్చిన అధికారులు
తెలంగాణలో బదిలీ అయిన పోలీస్ అధికారుల స్థానంలో ఇన్చార్జిలను నియమిస్తూ డీజీపీ అంజనీకుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్చార్జిల వివరాలు ఇలా ఉన్నాయి.. హైదరాబాద్ సీపీగా విక్రమ్సింగ్ మాన్, వరంగల్ సీపీగా డీ మురళీధర్, ఎస్ జయరాంను నిజామాబాద్ సీపీగా నియమించారు. సూర్యాపేట ఎస్పీగా ఎం నాగేశ్వర్రావు, సంగారెడ్డి ఎస్పీగా పీ అశోక్, కామారెడ్డి ఎస్పీగా కే నరసింహారెడ్డి, జగిత్యాల ఎస్పీగా ఆర్ ప్రభాకర్రావు, మహబూబ్నగర్ ఎస్పీగా అందెరాములు, నాగర్కర్నూల్ ఎస్పీగా సీహెచ్ రామేశ్వర్, గద్వాల ఎస్పీగా ఎన్ వి, మహబూబాబాద్ ఎస్పీగా జే చెన్నయ్య, నారాయణ్పేట ఎస్పీగా కే సత్యనారాయణ, భూపాలపల్లి ఎస్పీగా ఏ రాములును నియమించారు.