కౌలాలంపూర్: దక్షిణ చైనా సముద్ర తీర దేశాలైన మలేషియా, ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చింది. శుక్రవారం ఉదయం 7.09 గంటలకు మలేషియా రాజధాని కౌలాలంపూర్లో భూమి కంపించింది. దీని తీవ్రత 6.0గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (ఇండియా) తెలిపింది. భూకంప కేంద్రం కౌలాలంపూర్కు 384 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని పేర్కొన్నది.
ఇండోనేషియాలో కూడా భారీ భూకంపం సంభవించింది. ఉదయం 7.09 గంటలకు బుకిటిన్గీకి సమీపంలో భూమి కంపించింది. దీని తీవ్రత 6.2గా నమోదయిందని, భూకంప కేంద్రం బుకిటిన్గీకి 66 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) తెలిపింది. భూఅంతర్భాగంలో 12.3 కిలోమీటర్ల లోతులో ప్రకంపణలు వచ్చాయని వెల్లడించింది. ప్రస్తుతానికి ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని తెలిపింది.