కాలం అంటే అలుపెరగకుండా పరుగెత్తే సెకండ్ల ముల్లు కాదు.
నిదానమే ప్రధానమని భావించే నిమిషాల ముల్లు అంతకన్నా కాదు.
కదలీ కదలక జరిగే గంటల ముల్లూ కాదు.
యంత్రానికి అందని తంత్రమంతా కాలం కథలోనే కనిపిస్తుంది.
ఈ కాలచక్రంలోనే సృష్టి రహస్యం దాగి ఉన్నది.
ఈ అంతులేని కథను రసవత్తరంగా నడిపిస్తున్న
కథానాయకుడు సూర్యుడు.
ఏమిటీ కాలం..?ఎవరీ కాలనాథుడు..?
ఇనుడు అంటే సూర్యుడు. ‘ఇన’ శబ్దానికి సంచరించువాడు అని అర్థం. సూర్యుడు ఒకచోట స్థిరంగా ఉండకుండా, సంచరిస్తూ ఉంటాడని వేల ఏండ్ల కిందటనే చెప్పారు మన మహర్షులు. గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి. ఈ తిరగడంలో ఒక పద్ధతి ఉన్నది. నియంత్రణ ఉన్నది. ఒక గ్రహాన్ని మరొక గ్రహం ఢీ కొట్టుకోకుండా చూసే ఏర్పాటు ఉన్నది. ఈ ఏర్పాటును చూసే శక్తి పేరు శేషువు. ఈ విషయాన్నే స్థూలంగా ఆదిశేషుడు భూమిని మోస్తున్నాడు అని చెబుతున్నాయి పురాణాలు. సూర్యుడు తన చుట్టూ తాను మాత్రమే కాక అనేక కోట్ల సూర్యులతో కలిసి ఏర్పడిన పాలపుంత చుట్టూ తిరుగుతున్నాడు. దీనిపేరు బ్రహ్మాండం. ఈ బ్రహ్మాండాన్ని నిలబెట్టే గురుత్వాకర్షణ శక్తి పేరు కమఠ. అదే కూర్మశక్తి. అమృత మథనానికి తోడ్పడేందుకు మంధర పర్వతాన్ని మోసిన ఆది కూర్మం ఇదే. ఆధునికులు పాలపుంతగా భావిస్తున్న అంతరిక్షంలోని నక్షత్రమండల సముదాయాన్ని మన పూర్వులు క్షీర సముద్రంగా వర్ణించారు.
పాలపుంతలన్నీ కలిసి ఒక కేంద్రకాన్ని ఏర్పర్చుకొని దాని చుట్టూ తిరుగుతుంటాయి. ప్రాచీనుల భాషలో దాన్ని అఖిలాండ బ్రహ్మాండ కోటి అంటారు. ఈ ఏర్పాటును స్థిరపరిచే గురుత్వాకర్షణ శక్తిని ఆది వరాహమని, శ్వేత వరాహమని అన్నారు. భూమిని ప్రాణికోటి నివాస యోగ్యంగా స్థిరపరచిన ఈ వరాహం పేరునే పూజా సంకల్పాల్లో ‘శ్వేత వరాహ కల్పే’ అని జ్ఞాపకం చేసుకొంటున్నాం.
సూర్యుడిది ఏక చక్ర రథం. దానికి పూన్చిన గుర్రాలు ఏడు. కిరణంలోని ఏడు రంగులే ఏడు గుర్రాలు. అశ్వాలు వేగానికి ప్రతీక. వెలుగు కిరణం వేగంగా పయనిస్తుందన్నది సంకేతం. సూర్యుడు పట్టిచ్చిన కారణంగానే విష్ణుమూర్తి చక్రాయుధంతో తన తలను తెగ నరికాడన్న కోపంతో రాహువు సూర్యుడిని పట్టుకొని పీడించసాగాడు. ‘దేవతలందరి మేలును కోరి నేను రాహువును పట్టించాను. దాని ఫలితాన్ని నేను మాత్రమే అనుభవిస్తున్నాను. దేవతలెవరూ పట్టించుకోవడం లేద’న్న కోపంతో మండిపోవడం మొదలుపెట్టాడు సూర్యుడు. దాంతో లోకాలన్నీ దహించుకుపోవడం మొదలైంది.
దేవతలంతా బ్రహ్మదేవుడితో మొరపెట్టుకున్నారు. వినత కొడుకు అనూరుడు సూర్యుడి రథసారథిగా కుదురుకునేట్లు చేశాడు బ్రహ్మదేవుడు. సారథి రథికుడికి వెన్నుపెట్టి గుర్రాలను తోలాలి. అనూరుడు అందుకు భిన్నంగా సూర్యుడివైపు ముఖంపెట్టి కూర్చున్నాడు. సూర్యుడి నుంచి వెలువడే కిరణాల దుష్ప్రభావాలను తాను వడగట్టి, మంచి కిరణాలను భూమికి పంపడం మొదలుపెట్టాడు. సూర్యోదయానికి పూర్వం ఆకాశంలో కనబడే ఎరుపు వర్ణం అనూరుడు చేస్తుండే సాహసానికి సంబంధించిందే! ఈ కారణంగా అనూరుడికి అరుణుడు అన్నపేరు స్థిరపడింది. దీనిని ఓజోన్ పొర అతినీలలోహిత కిరణాలను అడ్టుకుంటుందన్న దానికి ప్రతీకగా తీసుకోవచ్చు.
ప్రాచీన గ్రంథాలలోని విషయాలను ఎవరికి తోచినట్లుగా వాళ్లు ఆధునిక శాస్ర్తాలకు ముడిపెట్టి విశ్లేషించ వచ్చా అన్నది ప్రశ్న. మహాభారతంలోని ఒక ఉపాఖ్యానం ఇందుకు సమాధానమిస్తుంది. గురుపత్ని కోరిక మేరకు పౌష్య మహాదేవి కుండలాలను ఆమె దగ్గర గ్రహించి తీసుకువస్తుంటాడు ఉదంకుడు. ఆ కుండలాలను ఉదంకుని దగ్గర నుంచి తస్కరించి ఎదురుగా ఉన్న పాముల పుట్టలో దూరి పాతాళానికి పారిపోతాడు తక్షకుడు. ఉదంకుడు పుట్టను తవ్వుకుంటూ పాతాళానికి చేరుకుంటాడు. తక్షకుడి నుంచి కుండలాలను తిరిగి సంపాదించి వాటిని గురుపత్నికి అందజేస్తాడు.
ఉదంకుడు పాతాళంలో కొన్ని దృశ్యాలను చూశాడు. కానీ, వాటి అంతరార్థం అతనికి బోధపడలేదు. సందేహ నివృత్తి కోసం తాను చూసిన విశేషాలను గురువుతో చెబుతాడు. ‘అయ్యా! అక్కడ ఇద్దరు వృద్ధ స్త్రీలు ఒక వస్ర్తాన్ని నేస్తున్నారు. ఒకావిడ నల్లని దారాన్ని వాడుతుండగా, మరొకావిడ తెల్లని దారాన్ని వాడుతున్నది. ఆ దారాలను పడుగు పేకలుగా వాడి వస్ర్తాన్ని నేస్తున్నారు. ఆ పక్కనే పెద్ద చక్రమున్నది. దానికి పన్నెండు ఆకులున్నాయి. ఆ చక్రాన్ని ఆరుగురు బాలురు తిప్పుతున్నారు. వారా చక్రం ఆగకుండా చూసే పనిలో నిమగ్నులై ఉన్నారు’ అని చెప్పాడు.
దానికి గురువు ఇలా సమాధానం ఇచ్చాడు. ‘ధాత, విధాత ఆ వృద్ధ స్త్రీల పేర్లు. నల్లని దారాలు రాత్రికి, తెల్లని దారాలు పగటికి సంకేతాలు. రాత్రింబవళ్లతో కూడిన దినాలను వారు తయారు చేస్తున్నారు. నీవు చూసిన చక్రం పేరు సంవత్సరం. దానికున్న పన్నెండు ఆకులు పన్నెండు నెలలు. ఆ చక్రాన్ని తిప్పుతున్న ఆరుగురు బాలురు.. ఆరు ఋతువులు’ అని వివరించాడు. ఇలా ఆ కథలో మరిన్ని విశేషాలు ఉన్నాయి. ఐరావతుడి కథ కూడా ఈ ఉపాఖ్యానం లోనిదే. ఇలా కాలానికి సంబంధించిన శాస్త్రీయ విషయాలు ఎన్నో మన వేదాల్లో, పురాణేతిహాసాల్లో కనిపిస్తాయి. సంకేతాల సాయంతో శాస్త్రీయ విషయాలను చెప్పడం మనవారికి వెన్నతో పెట్టిన విద్య అని గ్రహించడమే మన ఋషులకు మనం సమర్పించగల నివాళి.
కద్రువ సంతానంలో ఐరావతుడనే వాడు గొప్ప సర్పరాజు. అతనికి ఇరవైవేల మంది సంతానం. వీరందరూ సూర్యుడి రథానికి కట్టిన గుర్రాలను నియంత్రించడానికి అవసరమైన పగ్గాలుగా పనిచేయడానికి వంతుల వారిగా సూర్యమండలానికి వెళ్లి వస్తుంటారు. కాంతి కిరణాలు సరళరేఖలో పయనిస్తాయని మొదట్లో నమ్మిన ఆధునిక శాస్త్రజ్ఞులు అలల రూపంలో కూడా అవి ప్రసరిస్తాయని కనుగొన్నారు. కాంతి కిరణాలు పాముల వలె మెలికలు తిరుగుతూ అడ్డదిడ్డంగా, కట్టలుకట్టలుగా ప్రసరిస్తాయని మన పూర్వులు పేర్కొన్నారు.