శ్రీశైలం : శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవోపేతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు దేవస్థానం ఈఓ లవన్న తెలిపారు. ఆదివారం పరిపాలన భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్సవాల్లో క్షేత్రానికి వచ్చే భక్తులకు సంపూర్ణ దర్శనం కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. భక్తులతో స్నేహ, మర్యాదపూర్వకంగా మెలిగేలా సిబ్బందికి సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. కొవిడ్ నేపథ్యంలో అన్ని వాహనసేవలను ఆలయానికే పరిమితం చేస్తున్నట్లు తెలిపారు.
భక్తులకు పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించినట్లు పేర్కొన్నారు. వేడుకలకు హాజరయ్యే భక్తులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ఆలయ సిబ్బందికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కొవిడ్ నిబంధనల్లో భాగంగా గ్రామోత్సవాలు, కళాకారుల విన్యాసాలు రద్దు చేసినట్లు వివరించారు. ఈ నెల 7న దేవీశరన్నవరాత్రులు యాగశాల ప్రవేశంతో శాస్త్రోక్తంగా ప్రారంభించి. కలశ స్థాపన, మండపారాధన, అఖండజ్యోతి, మహాగణపతిపూజ, జపానుష్టానాలను అర్చక వేదపండితులతో ఏకాంతంగా నిర్వహించనున్నట్లు ఈఓ వివరించారు.