హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): బియ్యం కొనకపోతే రైతులు నష్టపోతారని రాష్ట్ర ప్రభుత్వం ఎంత మొరపెట్టుకొన్నా కేంద్రం పట్టించుకోవటం లేదు. ఈ నేపథ్యంలో యాసంగి సీజన్లో రైతులు వరిసాగును పక్కనపెట్టి ఇతర పంటల సాగుపై దృష్టి పెట్టాల్సిన సమయం ఆసన్నమైనది. పప్పు, నూనెగింజల పంటలను సాగు చేస్తే మేలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తున్నది. వ్యవసాయశాఖ అధికారులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే యాసంగి సీజన్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా పలువురు రైతులు ఇతర పంటల సాగును మొదలు పెట్టేశారు. ఆయా ప్రాంతాలకు తగ్గట్టుగా ఇతర పంటలను ఎంచుకొని సాగు చేస్తున్నారు. వీరి దారిలోనే రాష్ట్ర రైతాంగం మొత్తం ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది. వరి సాగుకు అవకాశం దక్కుతుందేమోనని ఆలస్యం చేస్తే ఇతర పంటల సాగుకు అనుకూలమైన కాలం పోయే ప్రమాదం ఉన్నది. ఇదే జరిగితే రైతుల పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారుతుంది. ఈ ఒక్క యాసంగికే కాదు.. ఇకపై ప్రతి యాసంగిలోనూ రైతులు వరి సాగు గురించి ఆలోచించకుండా ఇతర పంటల సాగుపైనే దృష్టిపెట్టాలి. అందుకు ఈ యాసంగి సీజన్ నుంచే ఏర్పాట్లు చేసుకోవటం మేలు అని అధికారులు సూచిస్తున్నారు.
కాలం.. నెల మాత్రమే
వరికి బదులు ఇతర పంటల్లో పెసర, పొద్దుతిరుగుడు, శనగ, వేరుశనగ, మినుములు, నువ్వులు సాగుచేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ పంటల సాగు కాలం నవంబర్ చివరి వరకు లేదా డిసెంబర్ వరకు పూర్తవుతుంది. అంటే మరో నెల రోజులే సాగుకు అవకాశం ఉన్నది. వేరుశనగను డిసెంబర్ మొదటివారం వరకు సాగు చేయొచ్చు. శనగ, ఆవాలు, కుసుమ పంటలను ఈ నెల చివరి వరకు, నువ్వులు జనవరి, ఫిబ్రవరిలో సాగు చేయొచ్చు. పొద్దుతిరుగుడు పంటను ఈ నెల నుంచి ఫిబ్రవరి వరకు సాగు చేసుకొనే అవకాశం ఉన్నది. పెసర పంటను తొలిదశలో డిసెంబర్ 15 వరకు, రెండో దశలో ఫిబ్రవరి నుంచి మార్చి 15 వరకు సాగు చేసుకొనే వీలున్నది. మినుము పంటను డిసెంబర్ 10 వరకు, ఫిబ్రవరి నుంచి మార్చి వరకు సాగు చేసుకోవచ్చు.
పొద్దుతిరుగుడు విత్తనాల కొరత
కేంద్రం అనాలోచిత నిర్ణయాలు, ముందుచూపులేని నిర్లక్ష్య వైఖరి రైతాంగానికి శాపంగా మారింది. వరి సాగు వద్దన్న కేంద్రం ప్రత్యామ్నాయంపై మాత్రం దృష్టిపెట్టలేదు. ఇందుకు ఉదాహరణే పొద్దుతిరుగుడు విత్తనాల కొరత. కేంద్రం ముందుచూపులేని కారణంగా ఎక్కడా ఒక గింజ కూడా దొరికే పరిస్థితి లేదు. పొద్దుతిరుగుడు సాగుకు సిద్ధంగా ఉన్నా విత్తనాలు దొరకటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదేండ్లుగా పొద్దుతిరుగుడు విత్తనాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది. రైతులు కూడా పంట సాగును తగ్గించారు. ఇప్పుడు ఒక్కసారిగా డిమాండ్ పెరగటంతో విత్తనాల కొరత ఏర్పడింది. విత్తనాల కొరత ఉన్నదని కేంద్రానికి ముందే తెలిసినా పరిష్కారమార్గాలను చూపకపోవటం వారి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం.
అధికారుల సలహాలు తీసుకోండి
ఇతర పంటల సాగుపై రైతులకు సందేహాలుంటే తమ పరిధిలోని వ్యవసాయ విస్తీర్ణ అధికారుల(ఏఈవో)ను సంప్రదించవచ్చు. లేదంటే మండల, జిల్లా స్థాయి వ్యవసాయశాఖ అధికారులను సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకొని, సలహాలు తీసుకోవచ్చు. వీలైతే ఆయా గ్రామాల రైతులు రైతు వేదికల్లో ఏఈవోల సమక్షంలో సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఇతర పంటల సాగుపై చర్చించుకోవటం మంచిది. ఇతర పంటలకు సంబంధించిన అన్నిరకాల విత్తనాలు ప్రభుత్వ, ప్రైవేటు విక్రయకేంద్రాల్లో అందుబాటులో ఉంచినట్టు విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు తెలిపారు. ఒక్క పొద్దుతిరుగుడు విత్తనాలు మినహా అన్నిరకాల పప్పులు, నూనెగింజలు, చిరుధాన్యాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు.
ఇతర పంటల సాగుపై దృష్టిపెట్టండి
యాసంగి బియ్యం కొనే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో రైతులు ఇక ఇతర పంటల సాగుపై దృష్టి పెట్టాలి. పప్పు, నూనె గింజలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నది. వరి సాగును మించి లాభాలు గడించవచ్చు. రైతులు ఆందోళన చెందకుండా ఇతర పంటలను సాగు చేయాలని కోరుతున్నాం. ఏమైనా ఇబ్బందులు ఉంటే ఏఈవోల సహకారం తీసుకోవచ్చు.