(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): బీజేపీ ప్రభుత్వ హయాంలో అన్నదాతకు కడగండ్లే మిగిలాయి. పంటకు పెట్టుబడి వ్యయం, రవాణా, ఎరువులు, కూలీల జీతాలు పెరిగిపోవడం, కనీస మద్దతు ధర లభించకపోవడం, మార్కెట్ యార్డుల్లోకి తీసుకుపోయిన ధాన్యాన్ని కొనేవారు లేకపోవడం వెరసి మహారాష్ట్రలో రైతన్నలు భారంగా బతుకులు వెళ్లదీస్తున్నారు. వ్యవసాయంలో కష్టాలే మిగలడంతో ఆ రాష్ట్రంలో సగటున రోజుకు ఎనిమిది మంది రైతన్నలు బలవన్మరణానికి పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలే ఇందుకు నిదర్శనం. బీజేపీ నేతృత్వంలోని ఏక్నాథ్ షిండే సర్కారు వచ్చినప్పటి నుంచి గడిచిన 7 నెలల్లో ఏకంగా 1,203 మంది రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
2014లో కేసీఆర్ తొలిసారిగా సీఎంగా బాధ్యతలు చేపట్టింది మొదలు.. రైతును నిజమైన రాజుగా చేయడమే లక్ష్యంగా పెట్టుకొన్నారు. ఎవుసాన్ని పండుగగా మార్చడానికి 30కి పైగా పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణను దేశానికి ధాన్యాగారంగా మార్చారు.
“వద్దు.. వద్దు అని చెప్పినా వినకుండా, ఎవుసంలకు దిగిండు నా కొడుకు. కన్న బిడ్డవోలే.. ఉల్లి పంటను పెంచిండు.. తీరా మార్కెట్కు బోతే.. రూపాయి కూడా రాకపాయె. పెట్టుబడి, కూలీ, రవాణా, ఎరువుల ఖర్చులు మెడకు సుట్టుకున్నయ్. చేసిన అప్పు తీర్చలేక, పారిపోలేక.. సచ్చిపోతా అంటుండు.. గదే కోపంల.. మొత్తం ఉల్లిని కాల్చేసిండు.. తండ్రిలా ఆదుకోవాల్సిన సీఎం ఏమో.. కోటలో కూసొని సీన్మా జూస్తుండు. 25 ఏండ్లు కండ్లలో పెట్టుకొని పెంచుకొన్న బిడ్డ సచ్చిపోతే, ఏ తైల్లెనా ఏం చేస్తది? ప్రజల్ని పట్టించుకోని.. గిట్లాంటి పాలకులను పాతరేస్తది!”
– నాసిక్ జిల్లాకు చెందిన మందాబాయ్