న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11: దేశంలో పారిశ్రామిక కార్యకలాపాలు కోలుకోవడం లేదు. ఇంకా మందగమనంలోనే కొనసాగుతున్నాయి. పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధిరేటు వరుసగా నాలుగో నెల్లోనూ తగ్గుముఖం పట్టడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నది. శుక్రవారం జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన వివరాల ప్రకారం గతేడాది డిసెంబర్లో ఐఐపీ వృద్ధి 0.4 శాతానికే పరిమితమైంది. తయారీ రంగం పేలవ ప్రదర్శనే ఇందుకు కారణమని ఎన్ఎస్వో వెల్లడించింది. ఐఐపీలో తయారీ రంగం వాటానే 77.63 శాతం. ఈ క్రమంలో డిసెంబర్లో తయారీ రంగం పనితీరు మైనస్ 0.1 శాతంగా ఉన్నది. దీంతో గనుల రంగంలో 2.6 శాతం, విద్యుదుత్పత్తిలో 2.8 శాతం వృద్ధి నమోదైనా ఫలితం లేకపోయింది. కాగా, నిరుడు ఆగస్టులో రెండంకెల వృద్ధిని అందుకున్న ఐఐపీ.. సెప్టెంబర్ నుంచి క్రమేణా తగ్గుతూ వస్తున్నది. 4.4 శాతం, 4 శాతం, 1.4 శాతం, ఇప్పుడు 0.4 శాతంగా దిగజారింది. ఇదిలావుంటే 2020 డిసెంబర్లో ఐఐపీ వృద్ధి 2.2 శాతంగా నమోదైంది. ఇక 2021 ఏప్రిల్-డిసెంబర్లో ఐఐపీ వృద్ధిరేటు 15.2 శాతంగా ఉన్నది. 2020 ఇదే కాలంలో 13.3 శాతంగా ఉండగా, గతేడాది సెప్టెంబర్లో చివరిసారిగా ఐఐపీలో వృద్ధి కనిపించినట్టు ఎన్ఎస్వో వెల్లడించింది.