చెన్నై: ఓ తాగుబోతు చేసిన తుంటరి పని దుబాయ్ వెళ్లాల్సిన విమానాన్ని ఆగిపోయేలా చేసింది. ఎయిర్పోర్టు సిబ్బంది, పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టేలా చేసింది. ఇంతకూ అతను చేసిన పని ఏందంటే.. ఆ తాగుబోతు కుటుంబానికి చెందిన ఇద్దరు వ్యక్తులు శనివారం ఉదయం దుబాయ్ వెళ్లేందుకు ఇంటి నుంచి బయలుదేరారు. అయితే వాళ్లు ఈ రోజు దుబాయ్కి వెళ్లడం తాగుబోతుకు ఇష్టం లేదు.
కానీ, వాళ్లు అతని మాటను పట్టించుకోకుండా ఎయిర్పోర్టుకు వెళ్లారు. దాంతో వాళ్లను ఎలాగైనా దుబాయ్ వెళ్లకుండా ఆపాలని తాగుబోతు ప్లాన్ చేశాడు. ఎయిర్పోర్టు సెక్యూరిటీ సిబ్బందికి ఫోన్ చేసి సదరు విమానంలో బాంబు ఉందని చెప్పాడు. దాంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టి బాంబు కోసం గాలించారు. అలాంటిదేమీ లేదని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం ఆలస్యంగా విమానం దుబాయ్కి బయలుదేరింది.
ఇక ఫోన్ కాల్ ఎవరి నుంచి వచ్చిందా అని ట్రేస్ చేయగా నిందితుడు దొరికిపోయాడు. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా.. తమ కుటుంబసభ్యులను దుబాయ్ వెళ్లకుండా ఆపేందుకే ఆ పని చేశానని చల్లగా చెప్పాడు. దాంతో ముక్కున వేలేసుకోవడం పోలీసుల వంతయ్యింది. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ ఘటన చోటుచేసుకుంది.