సిటీబ్యూరో,డిసెంబర్ 15 (నమస్తేతెలంగాణ): చేతినిండా డబ్బులు.. హైస్పీడ్ బైక్లు, కార్లు.. విచ్చలవిడితనం..వెరిసి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. మద్యం మత్తులో ఎలా వెళ్తున్నామోనన్న సోయి లేకుండా రోడ్లు దాటుతున్న వారిని, ఆగివున్న వాహనాలను ఢీకొంటూ మృత్యువాత పడడమే కాకుండా అవతలి వారి మరణానికి కారణమవుతున్నారు. అతివేగంగా, పట్టా పగ్గాల్లేకుండా నడుపుతూ కన్నవారికి తీరని శోకం మిగులుస్తున్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్లపై విన్యాసాలు చేస్తూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్నారు. గత శనివారం అర్ధరాత్రి తర్వాత దుండిగల్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడగా..ఇటీవల బంజారాహిల్స్ రోడ్డు నం.2లో కారు ఢీకొని ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. అతివేగం, మద్యం మత్తు వల్లే ఈ ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
అతివేగం అత్యంత ప్రమాదకరమని అందరికీ తెలుసు. పోలీసులు, స్వచ్ఛంద సంస్థలు వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తున్నా యువతలో మార్పు రావడం లేదు. అతివేగం,మద్యంమత్తులో వాహనం నడపడం సూసైడ్బాంబు కన్నా ప్రమాదకరం. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో జనవరి నుంచి నవంబర్ వరకు 237 రోడ్డు ప్రమాదాల మరణాలు జరగగా, ఇందులో 178 ఓవర్స్పీడ్తో జరిగినవే.
నగరంలో అధికంగా అర్ధరాత్రి తర్వాతే ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అర్ధరాత్రి దాటాకా రోడ్లపై డ్రంకెన్ డ్రైవ్ ముగుస్తుండడంతో మద్యంమత్తులో అతివేగంగా వాహనాలు నడుపుతున్నారు. శనివారం రాత్రి దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో ముగ్గురు స్నేహితులు అర్ధరాత్రి దాటిన తరువాత రోడ్లపై తిరుగుదామని కారులో బయలుదేరారు. మద్యంమత్తులో అతివేగంగా నడుపుతూ పార్కు చేసిన లారీని వెనుక నుంచి ఢీకొట్టారు. ఈ ఘటనలో ముగ్గురు యువకులు మృతి చెందారు. దేశంలోని ఇతర నగరాలతోపోలిస్తే హైదరాబాద్లో రోడ్లు చాలా మెరుగు. ఫలితంగా వాహనాల వేగం కూడా పెరుగుతోంది.
మార్కెట్లోకి కొత్తకొత్త హైస్పీడ్ కార్లు, బైక్లు ప్రవేశిస్తున్నాయి. పిల్లలపై ప్రేమతో తల్లిదండ్రులు కాదనకుండా అధిక సామర్థ్యం గల వాహనాలు కొనిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచుకోవడం, నిర్ణీత స్పీడ్తో వాహనాలు నడుపాలన్న విషయాన్ని చాలామంది విస్మరిస్తున్నారు. స్పీడ్గన్లతో ఓవర్స్పీడ్పై జరిమానాలు వేస్తున్నా పట్టించుకోవడం లేదు. నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేస్తూ ఇతరుల ప్రాణాలను బలిగొంటున్న వారికి వేగంగా శిక్షలు పడకపోవడం కూడా ప్రమాదాల పెరుగుదలకు కారణమని రవాణా నిపుణులు అంటున్నారు.