డ్రోన్ సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతూ వ్యవసాయ పనుల్లో రైతులకు మరింత సహాయకారిగా మారుతున్నది. దీంతో డ్రోన్ల వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. ముఖ్యంగా పంటలకు సోకిన చీడపీడల నివారణకు రసాయనిక మందుల పిచికారీకి డ్రోన్ స్ప్రేయర్లను వాడుతున్నారు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా పరిధిలో చాలామంది డ్రోన్ల సాయంతోనే మందులను పిచికారీ చేస్తున్నారు. కేవలం 15 లీటర్ల నీటితో 10 నిమిషాల్లో ఒక ఎకర పంటకు స్ప్రే చేయవచ్చు. అంతేకాకుండా డ్రోన్ పద్ధతిలో 25 శాతం వరకు సాధారణం కంటే తక్కువ మందును ఉపయోగిస్తారు. దీంతో అన్నదాతలకు ఖర్చు భారీగా తగ్గుతుంది. బ్యాటరీలు ఎప్పటికప్పుడు చార్జింగ్ చేసుకుంటూ ఒకరోజు సుమారు 50 ఎకరాల వరకు మందు పిచికారీ చేయవచ్చు. కాగా, పరిగిలో శుక్రవారం డ్రోన్తో కంది పంటకు మందు స్ప్రే చేసే విధానాన్ని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్, స్థానిక ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పరిశీలించారు.
పరిగి, నవంబర్ 26 : శాస్త్ర, సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందుతున్న కొద్దీ.., వాటి వాడకం అధికంగా వ్యవసాయ రంగంలోనే ఉంటుంది. ప్రకృతి వైపరిత్యాల సమయంలో, రహదారి సదుపాయం లేని చోట్లకు డ్రోన్లతో అత్యవసర మందులను అవసరమైన చోటకు చేరవేసేందుకు చేసిన ప్రయత్నాలు సక్సెస్ అయ్యాయి. ఇందులో భాగంగా మెడిసిన్ ఫ్రమ్ ది స్కై కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైంది. డ్రోన్ వినియోగంతో వ్యవసాయ రంగంలో పంటలకు సోకిన అనేక వ్యాధులు, చీడపీడల నివారణకు రసాయనిక మందుల పిచికారీకి దోహదం చేస్తుందని ఈ కార్యక్రమం ప్రారంభం రోజే ప్రకటించారు. ప్రస్తుతం వికారాబాద్ జిల్లా పరిధిలో వివిధ పంటలపై చీడపీడల నివారణ కార్యక్రమంలో భాగంగా డ్రోన్ సాయంతో మందుల పిచికారీ కొనసాగుతున్నది. తాజాగా జిల్లా పరిధిలోని పరిగిలో శుక్రవారం డ్రోన్తో కంది పంటపై క్రిమి సంహారక మందు పిచికారీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి ప్రారంభించారు. మాజీ ఎమ్మెల్యే కొప్పుల హరీశ్వర్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ సైతం డ్రోన్తో క్రిమిసంహారక మందు పిచికారీ విధానాన్ని పరిశీలించారు.
తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో..
శాస్త్ర, సాంకేతిక రంగాల అభివృద్ధి వ్యవసాయ రంగం పురోభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నది. ప్రస్తుతం డ్రోన్ల యుగం నడుస్తుందని చెప్పవచ్చు. సాధారణంగా ఒక ఎకరం కంది, ఇతర పంటల్లో క్రిమి సంహారక మందు ఒక వ్యక్తి పిచికారీ చేయడానికి కనీసం 4 నుంచి 5 గంటల సమయం, 250 లీటర్ల నీరు అవసరమవుతాయి. ఎక్కువ విస్తీర్ణంలో పంట ఉన్నట్లయితే నీటి వినియోగం మరింత అధికంగా ఉంటుంది. డ్రోన్ ద్వారా క్రిమిసంహారక మందు పిచికారీ చేయడానికి ఒక ఎకరాకు 15 లీటర్ల నీరు అవసరమవుతాయి. 10 నిమిషాలకు ఒక ఎకరా చొప్పున డ్రోన్ ద్వారా క్రిమిసంహారక మందు పిచికారీ చేయవచ్చు. ఒకసారి డ్రోన్ నాలుగు నాజిల్స్తో పిచికారీ చేస్తూ వెళ్తుంటే సుమారు 3 మీటర్ల వరకు మొక్కలపై క్రిమి సంహారక మందు పిచికారీ అవుతున్నది. డ్రోన్కు ఉపయోగించే బ్యాటరీలు ఎప్పటికపుడు చార్జింగ్ చేసుకుంటూ ఒకరోజు సుమారు 50 ఎకరాల వరకు సైతం పిచికారీ చేయవచ్చు. మొక్కకు పైభాగంలో పూర్తిస్థాయిలో, అన్ని మొక్కలకు సమపాళ్లలో క్రిమిసంహారక మందు పిచికారీ చేయవచ్చు.
ఎకరాకు రూ.400 నుంచి రూ.500..
ఒక ఎకరా పంటకు క్రిమిసంహారక మందు పిచికారీకి సుమారు రూ.800 వరకు ఖర్చు అవుతుందని అంచనా వేయగా డ్రోన్ సాయంతో రూ.400 నుంచి రూ.500 వరకు తీసుకుంటున్నారు. కంది, పత్తి, వరి, జొన్న, మొక్కజొన్న, ఉల్లిగడ్డ, కొత్తిమీర, మామిడితోటలు, జామ తోటలు, నిమ్మ తోటల్లో క్రిమిసంహారక మందు పిచికారీకి డ్రోన్ వినియోగిస్తున్నారు. యాలాల్ మండలం రాస్నం గ్రామానికి చెందిన శ్రావణ్కుమార్ ఏడాది కాలంగా ఈ డ్రోన్తో పిచికారీ చేపడుతున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలోని యాలాల్, ధారూర్, వికారాబాద్, పరిగి, కులకచర్ల, బషీరాబాద్, బంట్వారం, కోట్పల్లి మండలాల పరిధిలోని అనేక గ్రామాల్లో వినియోగంలో ఉన్నది. తాండూరులోని వ్యవసాయ పరిశోధన కేంద్రం వారు తమ సంస్థ ఆవరణలో సాగు చేసిన పంటలు, బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామంలో తమ సంస్థ సహకారంతో సాగు చేసిన కంది పంటకు ఆశించిన చీడపీడల నివారణకు పిచికారీ చేస్తున్నారు.
నేరుగా మొక్కపై పిచికారీ
డ్రోన్ సాయంతో వివిధ పంటలపై క్రిమిసంహారక మందు పిచికారీ చేయడం వల్ల అన్ని మొక్కలపై సమపాళ్లలో క్రిమి సంహారక మందు పడుతున్నది. తద్వారా చీడపీడలను నివారించవచ్చు. తక్కువ నీటి వినియోగం, తక్కువ సమయంలోనే ఎక్కువ విస్తీర్ణంలో వివిధ పంటలపై పిచికారీకి డ్రోన్ వ్యవస్థ దోహదం చేస్తున్నది.
వివిధ పంటలకు వినియోగం
జిల్లా పరిధిలోని సుమారు 8 మండలాల్లోని అనేక గ్రామాల్లో వివిధ రకాల పంటలను ఆశించిన చీడపీడల నివారణకు క్రిమిసంహారక మందును డ్రోన్ సాయంతో పిచికారీ చేయవచ్చు. ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న పంటలకు ఈ విధానం చాలా ఉపయుక్తంగా ఉంటుంది.