హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): ఎండాకాలంలో ఏ ఒక గిరిజన ఆవాసం కూడా తాగునీటి కోసం ఇబ్బంది పడవద్దని, అందుకు కావల్సిన అన్ని వసతులు వెంటనే కల్పించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంత్రి సత్యవతి రాథోడ్ శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తుతో కలిసి ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, మిషన్ భగీరథ అధికారులతో వేసవిలో మంచినీటి సరఫరాపై వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మారుమూల ఏజెన్సీ అటవీ ప్రాంతాల్లో 99 శాతం గ్రామాలకు మిషన్ భగీరథ తాగునీటిని అందిస్తున్నామని చెప్పారు. అయితే 105 ఆవాసాలు అత్యంత మారుమూల ప్రాంతాల్లో ఉండటం, కరెంట్ లేకపోవడం వల్ల ఇబ్బందులున్నాయని, వీటిని అధిగమించాలని పేర్కొన్నారు. ప్రతీ గిరిజన ఆవాసానికి 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలనే సంకల్పం త్వరలో నెరవేరనున్నదని, కరెంట్ లేని చోట్ల సోలార్ విద్యుత్తును అందించాలని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లోని కలెక్టర్లు, ప్రాజెక్టు అధికారులు, మిషన్ భగీరథ అధికారులు సమన్వయంతో పనిచేసి ఎక్కడా మంచినీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 30-40 ఆవాసాలకు అవసరమైతే ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందించాలని ఆమె ఆదేశించారు.
డెలివరీ అయిన ఒక మహిళ దవాఖాన నుంచి డిశ్చార్జి అయి 10 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లిందనే విషయం వెలుగులోకి రావడంపై మంత్రి సత్యవతి రాథోడ్ సీరియస్ అయ్యారు. ఇటువంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని అన్నారు. ప్రసవం అయిన తర్వాత తల్లీ, బిడ్డను ఇంటికి చేర్చేందుకు అమ్మఒడి వాహనాలున్నా ఇటువంటి పరిస్థితి ఎందుకొచ్చిందని ఆమె ప్రశ్నించారు. ఈ సంఘటనపై విచారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు.