మోదీ సర్కారులోని పెద్దలంతా దక్షిణ భారత రాష్ట్రాలకు వచ్చినప్పుడు మాటలు మాట్లాడమంటే.. కోటలు దాటేంత మాట్లాడుతారు. ఢిల్లీ వెళ్లేసరికి వారికి దక్షిణ భారతదేశం అని ఒకటున్నదన్న విషయాన్నే మరిచిపోతారు. రైళ్లు ఉత్తరాదికే.. రోడ్లు ఉత్తరాదికే.. ప్రాజెక్టులు ఉత్తరాదికే.. ప్యాకేజీలూ ఉత్తరాదికే.. చివరకు నదుల ప్రక్షాళన కూడా ఉత్తరాదికే. గంగానది ప్రక్షాళనకేమో వేల కోట్లు కేటాయించేస్తారు. మిగతా ప్రాంతాల్లో నదుల మాటే పట్టించుకోరు. రాష్ట్రాలు ప్రతిపాదనలు పంపినా బుట్టదాఖలే. రాష్ట్ర రాజధాని నడిమధ్య నుంచి ప్రవహించే అత్యద్భుతమైన మూసీ నదిని ప్రక్షాళన చేసేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనలే ఇందుకు ఉదాహరణ. దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యం కారణంగా కాలుష్య కాసారంగా మారిన మూసీని బాగుచేసేందుకు, దాని పరిసరాలను సుందరీకరించేందుకు రూ.8 వేల కోట్లతో తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు ఏడున్నరేండ్లుగా కేంద్ర పాలకుల కంట పడనే లేదు. రాజధాని నుంచి పార్లమెంట్ సభ్యుడిగా మాత్రమే కాకుండా కేంద్ర మంత్రిగా ఉన్న నాయకుడికి కూడా ఈ అంశం పట్టకపోవడం దురదృష్టకరం.
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 26 : హైదరాబాద్.. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి జరుగుతున్న మహానగరం. మిగతా మహానగరాలన్నింటితో పోలిస్తే.. అన్ని వర్గాల ప్రజలు జీవించడానికి అనువైన వాతావరణం ఉన్న నగరం. అన్నింటికీ మించి దేశానికి వ్యూహాత్మక రక్షణ ప్రాంతం. ఈ నగరాన్ని అభివృద్ధి చేయడం అంటే.. దేశానికి ఆర్థిక దన్ను కల్పించినట్టు. ఈ నగరం విశ్వనగరంగా మారితే.. దేశానికి ఆర్థిక వనరుల వరద పారుతుంది. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ అభివృద్ధికి సహకరించాల్సిన కేంద్రం.. రాజకీయ ప్రయోజనాలకోసం ప్రతిదానికీ మోకాలడ్డుతున్నది. రక్షణ రహదారులు కావొచ్చు.. స్కైవేలు కావొచ్చు, మెట్రో కావొచ్చు.. మూసీ రివర్ఫ్రంట్ కావొచ్చు.. ప్రతి అంశాన్నీ సమస్యాత్మకం చేసి ఒక్క అడుగు కూడా ముందుకు కదలకుండా చేస్తున్నది. నమామి గంగే పేరుతో యూపీ, బీహార్, బెంగాల్, ఉత్తరాఖండ్కు నిధుల వరద పారిస్తున్న మోదీ సర్కారు.. తెలంగాణకు, హైదరాబాద్కు తలమానికమైన మూసీ ప్రక్షాళనకు నిధులు ఇవ్వాలని కోరితే మొండిచెయ్యి చూపిస్తున్నది. ప్రతి ఏటా బడ్జెట్లో నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా (ఎన్ఎంసీజీ) కింద కేంద్రం ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తున్నది. జాతీయ నదీ పరిరక్షణ, అభివృద్ధి పథకం (నేషనల్ రివర్ కన్జర్వేషన్ డెవలప్మెంట్- ఎన్నార్సీడీ) కింద రూ.8వేల కోట్ల మేర ప్రతిపాదనలు తీసుకొంటుందే తప్ప నయా పైస కేటాయించడంలేదు. మూసీ పథకానికి కేంద్ర జల్శక్తి అభియాన్, ఎన్నార్సీడీ పథకాల కింద 60% నిధులు ఇచ్చేందుకు కేంద్రం సంసిద్ధత వ్యక్తం చేసిందంటూ నగర పర్యటన సందర్భంగా ఎన్నార్సీడీ డైరెక్టర్ జనరల్ రాజీవ్ రంజన్ మిశ్రా ప్రకటించారు. కానీ నేటికీ ఆచరణలో రూపాయి కూడా రాలేదు. మూసీ ప్రక్షాళనకు సహకరించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు చేసిన విజ్ఞప్తులన్నీ బుట్టదాఖలయ్యాయి.
గత పాలకుల ఫలితమే
హైదరాబాద్లో 6 వేల కిలోమీటర్ల పొడవున మురుగునీటి కాల్వలున్నాయి. 2 లక్షల మ్యాన్హోళ్లు ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం దశాబ్దాల క్రితమే ఏర్పాటైనవి. గత పాలకులు ఈ వ్యవస్థను విస్తరించలేదు. ఓ వైపు జనాభా పెరగటం, నగరం విస్తరించడంతో మురుగు ఉత్పత్తి కూడా రెట్టింపు అయింది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, జలమండలి ఆధ్వర్యంలోని 10 ఎస్టీపీల ద్వారా ప్రతిరోజూ 750 ఎంఎల్డీల వరకు శుద్ధి చేస్తున్నప్పటికీ ఫలితం లేదు. 610 ఎంఎల్డీ మేర మురుగునీరు మూసీలోకి చేరుతుండటంతో మురికికూపంలా నది మారిపోయింది. ఈ నేపథ్యంలోనే సివరేజ్ వ్యవస్థకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు మంత్రి కేటీఆర్ కార్యాచరణకు పూనుకొన్నారు. 169.30 చ.కి.మీ. నుంచి 1,400 చ.కి.మీ. మేరకు సేవల పరిధిని పెంచుతూ సమగ్ర సివరేజ్ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఔటర్ రింగు రోడ్డు వరకు సివరేజ్ వ్యవస్థకు ముంబైకి చెందిన షా కన్సల్టెన్సీ ద్వారా ప్రత్యేక మాస్టర్ప్లాన్ రూపకల్పన చేశారు. ఇందులో భాగంగానే దశలవారీగా చేపట్టనున్న కొత్త మురుగునీటి శుద్ధి కేంద్రాలు, సివరేజ్ ట్రంక్ మెయిన్స్, సబ్ మెయిన్స్ నిర్మాణాలకు రూ.8,684.54 కోట్లతో శ్రీకారం చుట్టారు.
ఈ ప్రాజెక్టు పనులకు రాష్ట్రంలోని నలుగురు బీజేపీ ఎంపీలు నిధులు తెస్తారా? మోదీ ఇస్తారా?
నదుల ప్రక్షాళనలోనూ ఉత్తరాదికే నిధులు
సొంత నిధులతోనే..
కేంద్రం నుంచి నిధులు రాబట్టడానికి ప్రయత్నాలను కొనసాగిస్తూనే.. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులతోనే మూసీ అభివృద్ధికి కార్యాచరణ ప్రారంభించింది. గుజరాత్లోని సబర్మతి నది తరహాలో మూసీ ప్రక్షాళనకు ప్రణాళికలు రూపొందించింది. ఇందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్డీసీఎల్)ను ఏర్పాటుచేసింది. మూసీ పరీవాహక ప్రాంతాల్లో మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటుచేసి, శుద్ధిచేసిన నీటిని మళ్లించే చర్యలు మొదలయ్యాయి. దీంతోపాటు సుందరీకరణ పనులతో పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నారు.
జీహెచ్ఎంసీ అవతల ఓఆర్ఆర్ పరిధి వరకు
ఔటర్ రింగురోడ్డు వరకు జలమండలి సేవల పరిధిని ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు పకడ్బందీగా మురుగునీటి నిర్వహణ పనులను చేపడుతున్నారు. ఇందులో భాగంగానే మంజీరా-నక్కవాగు పరివాహక ప్రాంతాల్లో 10 చోట్ల ఎస్టీపీలను నిర్మిస్తారు. 340.50 ఎంఎల్డీ సామర్థ్యంతో చేపట్టనున్న ఈ ఎస్టీపీలకు రూ.1,095.50 కోట్లు ఖర్చు చేస్తారు.