పేద విద్యార్థులను, బాల కార్మికులను ఆదరించి, ఆకలి తీర్చి, అక్కున చేర్చుకుని విద్యాబుద్ధులు ప్రసాదిస్తున్నది.. ‘డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ’. బాల కార్మికులు లేని సమాజాన్ని నిర్మించాలన్నది ఈ ఎన్జీవో ఆశయం. పదకొండేండ్లలో ఏడొందల మంది నిరుపేద విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్దిందీ సంస్థ.
ఇంజినీరింగ్ కాలేజ్ ఆవరణలో క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. రెండు రౌండ్లు పూర్తిచేసుకొని, మూడో రౌండ్ కోసం ఎదురుచూస్తున్నది షహీన్. అంతలోనే పిలుపు వచ్చింది. ఎదురుగా ఓ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ ప్రతినిధులు. ‘మిస్ షేక్ డౌలత్ షహీన్.. టెన్త్ 90 పర్సెంట్. ఇంటర్ 90 పర్సెంట్.
ఇంజినీరింగ్ టాపర్. గుడ్’ అంటూ ప్రతిభను కొనియాడారు. పదునైన ప్రశ్నలతో సామర్థ్యాన్ని బేరీజు వేశారు. ఎక్కడా తడబడకుండా సమాధానం చెప్పింది. ‘వెల్.. శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావ్?’ .. ఇదే చివరి ప్రశ్న. ‘నా ప్రతిభను బట్టి. మీ ఇష్టం సర్’ అని ముగించింది. బోర్డు సభ్యులు తమలో తాము చర్చించుకుని.. ‘16 లాక్స్ పర్ ఆనమ్’ అంటూ మంచి ప్యాకేజ్ ఆఫర్ చేశారు. హుందాగా ఆమోదం తెలిపి బయటికి వచ్చేసింది.
ఆ సంతోషాన్ని పంచుకునేందుకు సాహిని కాల్ చేసింది.. తల్లిదండ్రులకో, స్నేహితులకో కాదు. అమ్మ లాంటి అమ్మకు. అమ్మను మించిన అమ్మకు. ‘నేను సాధించాను. మీ కష్టానికి, నా కృషికి ఫలితం దక్కింది. 16 లక్షల వార్షిక జీతంతో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది’ అంటూ ఆనంద బాష్పాలు రాల్చింది. ఆ చల్లని తల్లి పేరు.. అరుణ చావా. ‘డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ’ వ్యవస్థాపకురాలు. తనే షహీన్ను చదివించింది. ఆత్మవిశ్వాసం నింపింది. గెలుపు సూత్రాలు బోధించింది. షహీన్ తండ్రి రిక్షా కార్మికుడు. నిరుపేద కుటుంబం. ఇది ఒక షహీన్ కథ మాత్రమే కాదు. ఆ సంస్థ ఆవరణలో జీవితాలను తీర్చిదిద్దుకున్న అనేకమంది షేక్ డౌలత్ షహీన్ల సక్సెస్ స్టోరీ.
అక్షరాల గుడి
డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ.. ఇదొక ఎన్జీఓ. పేద పిల్లలకు అన్నంపెట్టి బడికి పంపే మనసున్న స్వచ్ఛంద సంస్థ. దీని నిర్వాహకులు.. చావా అరుణ, సి.కల్యాణి, బి.పద్మావతి. వీధుల్లో తిరిగే పిల్లలను చేరదీసి, వారి తల్లిదండ్రుల వివరాలు తెలుసుకొని సంప్రదిస్తారు. దగ్గర్లోని ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ ఇప్పిస్తారు. అక్కడితో ఆగిపోరు. తరచూ ఉపాధ్యాయులతో సమావేశం అవుతారు. పిల్లల హాజరు గురించి తెలుసుకుంటారు. తమ ఎన్జీఓ నుంచి వచ్చే పిల్లలు ఎలా చదువుతున్నారు? పరీక్షలు ఎలా రాస్తున్నారు? ప్రవర్తన ఎలా ఉంది? ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది?.. తదితర విషయాలు చర్చిస్తారు. టీచర్ల సూచనలను పాటిస్తారు.
అన్నీ ఉచితమే
డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో చదివించే పిల్లలకు ఉదయం, సాయంత్రం ఉచితంగా ట్యూషన్ చెబుతారు. సమయానికి భోజనం పెడతారు. అవసరమైతే అల్పాహారం అందిస్తారు. ప్రైమరీ స్కూలు పిల్లలను దగ్గర్లోని పాఠశాలకు పంపుతారు. హైస్కూల్ విద్యార్థులను ఆటోలో ఐదు కిలో
మీటర్ల దూరంలోని ప్రభుత్వ పాఠశాలలో దించుతారు. దీనివల్ల పిల్లలు బడి మానేసే అవకాశమే లేదు. సాయంత్రం ఎన్జీవో ఆవరణలో ట్యూషన్ చెప్పి, రాత్రి భోజనం పెట్టి ఎనిమిదింటికి తల్లిదండ్రులకు అప్పగిస్తారు. విద్యార్థులకు ట్యూషన్లు చెప్పేందుకు ఐదుగురు టీచర్ల్లను నియమించుకున్నారు. ఎన్జీవోకు వచ్చే పిల్లలకు ఏవైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే.. వైద్యం అందించడానికి డాక్టర్ దేవయాని ఉండనే ఉన్నారు.
ముగ్గురమ్మలు..
పది మందితో మొదలై..
పదకొండేండ్ల క్రితం.. పదిమంది విద్యార్థులతో ప్రారంభమైంది డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ. నేటి వరకు ఈ ఎన్జీవో నీడన 700 మంది బాలబాలికలు ఆశ్రయం పొందారు. ఉన్నత విద్యల దిశగా అడుగులు వేశారు. జీవితాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం 68 మంది ప్రైమరీ స్కూలు విద్యార్థులు, 26 మంది హైస్కూల్ విద్యార్థులు భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు. హైకోర్టు లాయర్గా ప్రాక్టీస్ చేసిన చావా అరుణ.. సేవా దృక్పథంతో తన ఇంటినే ఎన్జీవోగా మార్చారు. మూడంతస్తుల భవనంలో.. పైరెండు ఫ్లోర్లనూ పిల్లల చదువులకు, భోజనాలకు ఉపయోగిస్తున్నారు. మొదట్లో అరుణ, కల్యాణి, పద్మావతి కలిసి స్థానిక పేద మహిళలతో డ్వాక్రా గ్రూపులు ఏర్పాటు చేయించేవారు. అనేక కార్యక్రమాలు చేపట్టేవారు. ఇప్పటికీ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందనే విశ్వాసంతో.. పిల్లల బాధ్యతా తీసుకున్నారు. దాదాపు పద్దెనిమిది మందికి ఎన్జీవో ఆవరణలోనే నీడనిస్తున్నారు. అక్కడ బోధించే ప్రతి అక్షరం ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అక్కడ వడ్డించే ప్రతి భోజనం జీవనకాంక్షను రగిలిస్తుంది. వ్యవస్థాపకుల లక్ష్యమూ అదే.
మినీ స్కూల్ వ్యాన్ కావాలి!
కూకట్పల్లిలోని మా ఎన్జీవో నుంచి హైదర్నగర్లోని హైస్కూల్కు పిల్లల్ని తీసుకెళ్లి, తీసుకురావడానికి ఓ మినీ బస్సు ఉంటే బాగుంటుంది. దాతలు ముందుకొచ్చి సాయపడితే జీవితాంతం రుణపడి ఉంటాం. ఒక్కోసారి మా స్థాయికి మించి ఖర్చు చేయాల్సి వస్తున్నది. అలాంటప్పుడు, డబ్బు సర్దుబాటు చేయలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం. దాదాపు తొంభైమంది పిల్లలకు ఉదయం, సాయంత్రం భోజనాలు, అల్పాహారం అందించడం, ఆటోల అద్దెలు చెల్లించడం తలకు మించిన భారం అవుతున్నది. నెలనెలా రూ.లక్షకు పైగా ఖర్చు అవుతుంది. స్కూల్వ్యాన్ ఉంటే మా బాధలు సగం తీరినట్లే. దాతలు స్పందిస్తే.. మా ఎన్జీవోను విస్తరించడానికి సిద్ధంగా ఉన్నాం.
– చావా అరుణ, ఫౌండర్
డ్రీమ్ ఫర్ గుడ్ సొసైటీ
(9346980729)