న్యూఢిల్లీ : దేశీయంగా అభివృద్ధి చేసిన స్మార్ట్ యాంటీ ఎయిర్ఫీల్డ్ వెపన్ (SAAW)ను భారత రక్షణ పరిశోధన సంస్థ (DRDO), ఇండియన్ ఎయిర్ఫోర్స్ (IAF) విజయవంతంగా పరీక్షించాయి. వంద కిలోమీటర్ల పరిధిలో ఉన్న శత్రువుల రన్వేలు, బంకర్లు, ఎయిర్ క్రాఫ్ట్ హ్యాంగర్లు, రాడార్లతో పాటు రీన్ఫోర్డ్స్ నిర్మాణాలను ఖచ్చితత్వంతో ధ్వంసం చేసే గైడెడ్ మిస్సైల్ ఇది. అక్టోబర్ 28న రాజస్థాన్లోని జైసల్మేర్లోని చందన్ శ్రేణుల వద్ద తొలిసారిగా పరీక్షించగా.. ఇవాళ మరోసారి ప్రయోగం చేపట్టారు. శాటిలైట్ నావిగేషన్, ఎలక్ట్రో-ఆప్టికల్ సెన్సార్ల ఆధారంగా రెండు వేర్వేరు కాన్ఫిగరేషన్లను విజయవంతంగా పరీక్షించారు.
ఎలక్ట్రో-ఆప్టికల్ సీకర్ ఆధారిత ప్రయోగం దేశంలో తొలిసారిగా జరిగిందని డీఆర్డీఓ అధికారి తెలిపారు. సిస్టమ్ ఎలక్ట్రో-ఆప్టికల్ కాన్ఫిగరేషన్ ఆయుధం ఖచ్చితమైన సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు ఇమేజింగ్ ఇన్ఫ్రా-రెడ్ (IIR) సీకర్ టెక్నాలజీని వినియోగించారు. రెండు టెస్టుల్లోనూ అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితత్వంతో చేధించామన్నారు. ఈ మిస్సైల్ను డీఆర్డీవో లేబొరేటరీల సమన్వయంతో ఐఏఎఫ్ సహకారంతో రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) రూపొందించి, అభివృద్ధి చేసింది. హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) బెంగళూరు విమానంతో ఆయుధాన్ని అనుసంధానించింది. ఈ సందర్భంగా డీఆర్డీఓ, ఐఏఎఫ్ బృందాలను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు.