హైదరాబాద్, అక్టోబర్ 29: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ పోత్సాహకర ఫలితాల్ని ప్రకటించింది. ఈ సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ కన్సాలిడేటెడ్ నికరలాభం 30 శాతం వృద్ధితో రూ.992 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదేకాలంలో లాభం రూ.762 కోట్లు. కంపెనీ వ్యాపారం చేసే అన్ని దేశాల్లోనూ అమ్మకాలు పెరగడంతో సమీక్షా త్రైమాసికంలో ఆదాయం రూ.4,897 కోట్ల నుంచి రూ. 5,763 కోట్లకు చేరింది. ఇతర ఆదాయం సైతం రూ. 15 కోట్ల నుంచి రూ. 170 కోట్లకు ఎగసింది. యాంటీ క్యాన్సర్ ఏజెంట్ ఈ777 (డెనిల్యూకిన్ డిఫ్టిటోక్స్) హక్కుల్ని సిటియస్ ఫార్మాస్యూటికల్స్కు విక్రయించడం ద్వారా ఇతర ఆదాయం పెరిగినట్లు డాక్టర్ రెడ్డీస్ శుక్రవారం తెలిపింది.
భారత్లో వ్యాపారం ద్వారా తమ ఆదాయం 25 శాతం పెరిగి రూ.1,140 కోట్లకు చేరిందని, వర్థమాన మార్కెట్లలో 50 శాతం వృద్ధితో రూ. 1,300 కోట్లకు పెరిగినట్లు కంపెనీ వివరించింది. కంపెనీకి ప్రధాన మార్కెట్ అయిన ఉత్తర అమెరికాలో అమ్మకాలు 3 శాతం వృద్ధితో రూ. 1,891 కోట్లకు పెరిగాయి.
రష్యాకు చెందిన కొవిడ్-19 వ్యాక్సిన్కు సంబంధించిన సింగిల్ డోస్ స్పుత్నిక్-వీ లైట్పై ఫేజ్ 3 ట్రయిల్స్ డాటాను నవంబర్ నెలలో డ్రగ్ రెగ్యులేటర్ డీసీజీఐకి సమర్పించగలమని భావిస్తున్నట్లు రెడ్డీస్ వెల్లడించింది. అలాగే 2-18 ఏండ్ల మధ్య వయస్సుగల పిల్లల కోసం ఉద్దేశించిన రెండు డోసుల స్పుత్నిక్ వ్యాక్సిన్పై పరీక్షలు నిర్వహించేందుకు సిద్దమవుతున్నట్లు కంపెనీ సీఈవో (ఏపీఐ, సర్వీసులు) దీపక్ సప్రా తెలిపారు.
‘మా వ్యాపారాలన్నింటిలోనూ ఆర్థిక పనితీరు మెరుగుపడింది. మా ప్రధాన వ్యాపారమైన జెనెరిక్స్, ఏపీఐల్లో పటిష్ఠ వృద్ధిని సాధిస్తున్నాం. దీర్ఘకాలిక వృద్ధికి, నవకల్పన సామర్థ్యాల్ని పెంచుకోవడానికి పెట్టుబడులు చేస్తున్నాం’
-జీవీ ప్రసాద్, రెడ్డీస్ కో-చైర్మన్