న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: అదానీ గ్రూప్ అవకతవకతలపై మార్కెట్ నియంత్రణా సంస్థ సెక్యూరిటీస్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ), బ్యాంకింగ్ రెగ్యులేటర్ ఆర్బీఐలు దర్యాప్తు చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరో వైపు ఆ దర్యాప్తు పట్ల పలు అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. సెబీ కీలక కమిటీలో అదానీ కుటుంబానికి దగ్గర బంధువు సభ్యుడిగా ఉండటమే ఇందుకు కారణం. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ కుమారుడు కిరణ్ మామ సైరిల్ ష్రాఫ్ సెబీ సభ్యుడిగా ఉన్నారు. సెబీ వెబ్సైట్లో పొందుపర్చిన సమాచారం మేరకు కార్పొరేట్ గవర్నెన్స్, ఇన్సైడర్ ట్రేడింగ్పై సెబీ 2017లో ఏర్పాటుచేసిన కమిటీలో ష్రాఫ్ సభ్యుడు. అలాగే ఐఎంసీ ఇంటర్నేషనల్ ఏడీఆర్ సెంటర్కు చెందిన అడ్వయిజరీ కమిటీ, ఫైనాన్స్ ప్లానింగ్ స్టాండర్డ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఎఫ్పీఎస్బీ ఇండియా)కు అడ్వయిజరీ మెంబర్. పారిశ్రామిక చాంబర్లు సీఐఐ, ఫీక్కీలు ఏర్పాటుచేసిన వివిధ కమిటీల్లో సభ్యుడిగా ఉన్నారు. అదానీ గ్రూప్కు లీగల్ సలహాలు కూడా సిరిల్ ష్రాఫ్ ఇస్తారు. ఆయన కుమార్తె పరిధి ష్రాఫ్ను కిరణ్ అదానీని పెండ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మోహువా మొయిత్రా శుక్రవారం చేసిన ఓ ట్వీట్ వైరల్గా మారింది. గౌతమ్ అదానీ కుమారుడు కిరణ్ అదానీ మామ సైరిల్ ష్రాఫ్ సెబీ కమిటీ సభ్యుడిగా ఉన్నారని మొయిత్రా తెలిపారు. అదానీ గ్రూప్పై సెబీ దర్యాప్తు జరుపాలని అనుకొంటే, ముందు సైరిల్ను కమిటీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
సెబీ వివరణ..
సైరిల్ ష్రాఫ్ శాశ్వత సభ్యుడు కాదని సెబీ వర్గాలు తెలిపాయి. దర్యాప్తు, సలహాలు, సూచనల కోసం సెబీ పలు కమిటీలను ఏర్పాటు చేస్తుందని, అలా ఏర్పాటు చేసిన ఓ కమిటీలో ఆయన సభ్యుడుగా గతంలో వ్యవహరించారని తెలిపింది. ఇప్పుడు ఆ కమిటీ మనుగడలో లేదని వివరించింది.