హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో రైతు రాజ్యం పరిఢవిల్లుతుంటే.. ‘డబుల్ ఇంజిన్’ ప్రభుత్వాలున్నట్టు చెప్పుకొంటున్న రాష్ర్టాల్లో రైతులు డబుల్ చార్జీల మోతతో తల్లడిల్లుతున్నారు. దేశంలో వ్యవసాయానికి నిరంతరం నాణ్యమైన విద్యుత్తును పూర్తి ఉచితంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా రైతుల నుంచి తెలంగాణ అభినందనలు అందుకొంటుంటే.. బీజేపీ పాలిత రాష్ర్టాలతోపాటు ఇతర రాష్ర్టాల్లో విద్యుత్తు చార్జీలను భారీగా పెంచి రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజలకు ఎడాపెడా వాతలు పెడుతున్నారు. పైపెచ్చు తాము చేస్తున్నదే సక్రమమని సమర్ధించుకొంటున్నారు. రైతులకు ఉచితంగా విద్యుత్తును అందజేయడం మహా నేరమన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంలో తెలంగాణ సైతం తమ బాటలోనే నడవాలని, వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించి రైతుల నుంచి విద్యుత్తు చార్జీలు వసూలు చేయాల్సిందేనని వితండ వాదన చేస్తున్నారు. దీన్ని సీఎం కేసీఆర్ నిర్దంద్వంగా తోసిపుచ్చుతున్నా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాత్రం తన మంకుపట్టును వీడటం లేదు. తెలంగాణ పట్ల, ప్రత్యేకించి తెలంగాణ రైతుల పట్ల అడుగడుగునా కక్షతో వ్యవహరిస్తున్న మోదీ సర్కారు.. విద్యుత్తు చట్ట సవరణ బిల్లుపై ఎవరేమి చెప్పినా, ఎన్ని అభ్యంతరాలు వ్యక్తమైనా ఖాతరు చేయడం లేదు. ఈ ఏడాది చివర్లో జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఎలాగైనా ఆమోదించుకొనేందుకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ సహా ఇతర బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రైతుల నుంచి వసూలు చేస్తున్న వ్యవసాయ విద్యుత్తు చార్జీలపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనమిదీ..
మధ్యప్రదేశ్లో మరీ దారుణం
మధ్యప్రదేశ్లో విద్యుత్తు చార్జీల బాదుడు మరీ దారుణంగా ఉన్నది. ఆ రాష్ట్రంలో వ్యవసాయ పంప్సెట్ల నుంచి నెలకు 300 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్కు రూ.4.79 చొప్పున, ఒక్కో హెచ్పీకి రూ.58 చొప్పున రైతులను డబుల్ వాయింపు వాయిస్తున్నారు. 300 నుంచి 750 యూనిట్ల వరకు కాల్చే రైతుల నుంచి యూనిట్కు రూ.5.82 చొప్పున, హెచ్పీకి రూ.74 చొప్పున బాదతున్నారు. నెలకు 750 యూనిట్లకుపైగా విద్యుత్తును ఉపయోగించుకొన్న రైతుల నుంచి యూనిట్కు రూ.6.10 చొప్పున, హెచ్పీకి రూ.81 చొప్పున వసూలు చేస్తున్నారు.
ఇతర రాష్ర్టాల్లోనూ అదే పరిస్థితి
బీజేపీ పాలిత రాష్ర్టాలతోపాటు పశ్చిమ బెంగాల్, కేరళ, ఛత్తీస్గఢ్, ఒడిశా, బీహార్ లాంటి పలు ఇతర రాష్ర్టాల్లోనూ వ్యవసాయ విద్యుత్తు చార్జీలు ఎక్కువగానే ఉన్నాయి. తెలంగాణలో సీఎం కేసీఆర్ 2018 జనవరి 1 నుంచి వ్యవసాయానికి పూర్తి ఉచితంగా విద్యుత్తును అందిస్తున్నారు. దీన్ని జీర్ణించుకోలేకపోతున్న మోదీ సర్కారు తెలంగాణ పట్ల, ముఖ్యంగా తెలంగాణ రైతుల పట్ల కక్షగట్టినట్టుగా వ్యవహరిస్తున్నది. అందుకే విద్యుత్తు చట్ట సవరణ బిల్లును రూపొందించి పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. ఇది అమల్లోకి వస్తే తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టి భారీగా చార్జీలను వసూలు చేయాల్సి వస్తుంది. వీటి పీడ తెలంగాణ రైతులకు లేకుండా చూసేందుకే సీఎం కేసీఆర్ తన కంఠంలో ప్రాణమున్నంత వరకు రైతులపై భారం వేయబోనని, వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు.
గుజరాత్లోనూ వాతలే
దేశానికే రోల్ మోడల్గా బీజేపీ నాయకులు చెప్తున్న గుజరాత్లోనూ రైతులకు విద్యుత్తు చార్జీల వాతలు తప్పడం లేదు. అక్కడ మీటర్లు బిగించని మోటర్ల నుంచి యూనిట్కు నిర్దిష్టంగా ఇంత అని కాకుండా ప్రతి నెలా ఒక్కో హెచ్పీకి రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారు. మీటర్లు బిగించిన మోటర్ల నుంచి ఒక్కో హెచ్పీకి రూ.20 చొప్పున, యూనిట్కు 60 పైసల చొప్పున తీసుకొంటున్నారు. అదే తత్కాల్ పద్ధతిలో అయితే హెచ్పీకి రూ.20 చొప్పున, యూనిట్కు 80 పైసల చొప్పున వసూలు చేస్తున్నారు.
డబుల్ ఇంజిన్ రాష్ర్టాల్లో బాదుడే బాదుడు
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో విద్యుత్తు చార్జీల బాదుడు డబుల్ స్థాయిలో ఉన్నట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో మీటర్లు బిగించిన ప్రతి వ్యవసాయ పంప్సెట్ నుంచి డిమాండ్ చార్జీగా ఒక్కో హెచ్పీకి నెలకు రూ.70 చొప్పున, ఒక్కో యూనిట్కు రూ.2 చొప్పున వసూలు చేస్తున్నారు. మీటర్లు పెట్టని పంపుసెట్ల నుంచి ప్రతి హెచ్పీకి నెలకు రూ.170 చొప్పున వసూలు చేస్తున్నారు. అర్బన్ ప్రాంతాల్లో మీటర్లు బిగించిన పంపుసెట్ల నుంచి హెచ్పీకి నెలకు రూ.130 చొప్పున, యూనిట్కు రూ.6 చొప్పున బాదుతున్నారు.