దుండిగల్/కేపీహెచ్బీ కాలనీ, ఫిబ్రవరి17 : రాష్ట్రంలో ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూంను ఇస్తామని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని గురువారం ‘గిప్ట్ ఏ స్మైల్’ కార్యక్రమాన్ని చేపట్టారు. మంత్రి కేటీఆర్ 150మందికి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్ 50 మందికి, మాధవరం కృష్ణారావు 50 మందికి, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు 50 మంది చొప్పున మొత్తం 300 మంది వికలాంగులకు మూడు చక్రాల వాహనాలను అందించారు. ఈ వాహనాలను కుత్బుల్లాపూర్లోని బహదూర్పల్లిలోని మేకల వెంకటేశ్ ఫంక్షన్హాల్లో మంత్రులు కేటీఆర్, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు శంభీపూర్రాజు, నవీన్రావులు దివ్యాంగులకు అందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఒక మనిషికి చిరునవ్వు అందించడమే లక్ష్యంగా చేపట్టిన ఒక చిరు ప్రయత్నమే గిప్ట్ ఏ స్మైల్ అని అన్నారు. దేశంలో దివ్యాంగులకు అత్యధిక పింఛన్ అందిస్తున్నది తెలంగాణ రాష్ట్రమేనని చెప్పారు. దివ్యాంగులకు ఎంత చేసినా తక్కువేనని, వారికి నిరంతరం అండగా ఉంటామని అన్నారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాలకు ముందుకొచ్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ఎండీసీ చైర్మన్ మన్నె క్రిశాంక్, దివ్యాంగుల కార్పొరేషన్ అధ్యక్షులు వాసుదేవరెడ్డి, గిప్ట్ ఏ స్మైల్ బృందం పాల్గొన్నారు.