Morphing Photos | సిటీబ్యూరో, మార్చి 24 (నమస్తే తెలంగాణ): నగరానికి చెందిన 29 ఏండ్ల యువకుడు తన అవసరం నిమిత్తం లోన్ యాప్ ద్వారా కొంత రుణం తీసుకొని.. తిరిగి రుణం చెల్లించాడు. అయితే, రుణ యాప్ రికవరీ ఏజెంట్లు ఫోన్చేసి.. నీవు ఇంకా రూ. 95,500 చెల్లించాల్సి ఉంది.. అంటూ ఒత్తిడి తెచ్చారు. నేను ఇది వరకే రుణం చెల్లించానంటూ.. ఎంత చెప్పినా వినకుండా నీవు డబ్బు చెల్లించకపోతే నీ ఫొటోలు మీ వాళ్లందరికి పంపించి.. ఇజ్జత్ తీస్తామంటూ బెదిరించారు. నీ ఇష్టం వచ్చింది చేసుకో.. అంటూ బాధితుడు గట్టిగానే బదులిచ్చాడు. ఆ తర్వాత సైబర్నేరగాళ్లు బాధితుడి మార్ఫింగ్ ఫొటోలను అతడి సెల్ఫోన్లో ఉన్న కాంటాక్టు నంబర్లకు పంపించారు. అందులో కుటుంబ సభ్యులు, చుట్టాలు ఉన్న మహిళల ఫోన్ నంబర్లకు ప్రత్యేకంగా ఆ ఫొటోలను పంపించారు. ఈ విషయం తెలుసుకున్న బాధితుడు షాకుకు గురయ్యాడు. అన్నట్లే తన ఇజ్జత్ మొత్తం పోయిందంటూ కుమిలిపోతూ మనస్తాపానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ధైర్యం చెప్పి.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదయ్యింది.. ఇది ఒక్కరి సమస్య కాదు.. ప్రతి రోజు సైబర్క్రైమ్ ఠాణాలకు ఇలాంటి బాధితులు ఎందరో వస్తున్నారు.
కొందరు అవసరాల కోసం రుణం తీసుకుంటుండగా, మరికొందరు యాప్లలో రుణం తీసుకొని ఆ తరువాత కడితే కడుదాం.. లేదంటే లేదు.. అన్న ధోరణితో ఉంటారు. అవసరాల నిమిత్తం తీసుకొని, అప్పు విషయం ఎవరికీ తెలియకుండా ఉండేలా వడ్డీలకు వడ్డీలు చెల్లిస్తూ తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ప్రయత్నిస్తుంటారు. రుణం ఇచ్చే సమయంలోనే మన ఫోన్ కాంటాక్టులన్ని లోన్యాప్ నిర్వాహకుల చేతిలోకి వెళ్లిపోతాయి. బాధితుల ఫోన్లోని కాంటాక్ట్స్ ఇవ్వకుంటే రుణం ఇచ్చేందుకు యాప్లు ఒప్పుకోవు. దీంతో తప్పని సరిగా లోన్యాప్ నిర్వాహకులు చెప్పినట్లే నడుచుకోవాల్సి వస్తుంది. అవసరాల కోసం రుణం తీసుకున్న ఇలాంటి వారినే సైబర్నేరగాళ్లు ఎక్కువగా టార్గెట్ చేస్తుంటారు. తీసుకున్న రుణానికి రెండు మూడింతలు తిరిగి తీసుకుంటున్నారు. అయినా కూడా వేధింపులు మానకుండా అందిన కాడికి దోచేద్దామనే ఆలోచనతో లోన్ యాప్ రికవరీ ఏజెంట్లు ఉంటారు. ఇందులో కొందరు నేరుగా లోన్ యాప్ల ద్వారా చేస్తుండగా, మరికొందరు లోన్ యాప్ల నుంచి రికవరీ ఏజెంట్లు పనిచేస్తున్నారు. బాధితులు వారి చేతికి దొరికారంటే ఎంతవరకైనా వెళ్దామని ఈ లోన్ యాప్లకు సంబంధించిన రికవరీ ఏజెంట్లు వ్యవహరిస్తుంటారు. ఏజెంట్లు ఎంత వసూలు చేస్తే వారికి అంత కమీషన్ పెరుగుతూ వస్తుంది. దీంతో వెనుకా ముందు ఆలోచించకుండా బాధితుల వద్ద నుంచి భారీగా డబ్బు వసూలు చేస్తుంటారు. అవసరమైతే బ్లాక్ మెయిలింగ్కు కూడా ఏజెంట్లు దిగుతుంటారు.
రుణం తీసుకున్న సమయంలోనే మన ఫోన్లోని కాంటాక్టు నంబర్లు సైబర్నేరగాళ్ల చేతికి ఇచ్చేస్తున్నాం. సైబర్నేరగాళ్లు చేసే బ్లాక్ మెయిలింగ్కు భయపడకపోతే, అశ్లీల ఫొటోల అస్త్రం వాడుతారు. ఇంటర్నెట్ నుంచి నగ్న ఫొటోలు సేకరించి, ఆ ఫొటోలో వ్యక్తి తలను తొలగించి బాధితుల ఫొటో తలను అతికిస్తారు. దీంతో ఈ మార్ఫింగ్ ఫొటోలను చూడగానే బాధితులు షాక్కు గురవుతారు. ఇక్కడే బాధితులు ధైర్యంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ఆ ఫొటోలు మార్ఫింగ్వనే విషయాన్ని గుర్తించాలంటున్నారు. అలాంటి ఫోన్కాల్స్, ఫొటోలను ఎవరైనా పంపిస్తే మీ దగ్గరి వాళ్లకు విషయం చెప్పాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇదంతా సైబర్నేరగాళ్ల పని అని.. మీ కాంటాక్టులో ఉన్న వాళ్లకు చెప్పాలంటూ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.