ముంబై, డిసెంబర్ 6: మదుపరులను చుట్టుముట్టిన ఒమిక్రాన్ భయాలు.. దేశీయ స్టాక్ మార్కెట్లను కుప్పకూల్చాయి. ఈ కరోనా వైరస్ కొత్త రకం కేసులు భారత్లోనూ పెరుగుతుండటం సోమవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడికి దారితీసింది. ఫలితంగా బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 949.32 పాయింట్లు లేదా 1.65 శాతం పతనమై 56,747.14 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 284.45 పాయింట్లు లేదా 1.65 శాతం క్షీణించి 16,912.25 వద్ద నిలిచింది. గత శుక్రవారం కూడా సూచీలు పడిపోయిన విషయం తెలిసిందే.
కాగా, డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ మరింత దిగజారడం, విదేశీ సంస్థాగత మదుపరులు పెట్టుబడుల ఉపసంహరణకే ప్రాధాన్యత ఇవ్వడం కూడా తాజా నష్టాలకు కారణమని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఫెడ్ రిజర్వ్ పాలసీ, ముఖ్యంగా బుధవారం ఆర్బీఐ ద్రవ్యవిధాన సమీక్ష నిర్ణయాలుండటంతో మున్ముందూ అమ్మకాల ఒత్తిడి కొనసాగవచ్చన్న అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. ఇదిలావుంటే సెన్సెక్స్లో ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ విలువ అత్యధికంగా 3.75 శాతం పడిపోయింది.
బజాజ్ ఫిన్సర్వ్, భారతీ ఎయిర్టెల్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లూ మదుపరులను ఆకట్టుకోలేక డీలా పడ్డాయి. రంగాలవారీగా ఐటీ, టెక్నాలజీ, టెలికం, ఎనర్జీ, హెల్త్కేర్, ఆటో సూచీలు 2.49 శాతం క్షీణించాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు కూడా 1.35 శాతం చొప్పున పతనమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే.. ఆసియా దేశాల సూచీలైన చైనా, హాంకాంగ్, జపాన్ నష్టపోయాయి. దక్షిణ కొరియా సూచీ మాత్రం లాభాల్లో స్థిరపడింది. ప్రధాన ఐరోపా మార్కెట్లూ లాభాల్లోనే కదలాడాయి.
5.80 లక్షల కోట్లు ఫట్
స్టాక్ మార్కెట్ల భారీ నష్టాల
నేపథ్యంలో రెండు రోజుల్లోనే రూ.5.80 లక్షల కోట్లకుపైగా మదుపరుల సంపద ఆవిరైపోయింది. సోమవారం ఒక్కరోజే బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.4.29 లక్షల కోట్లు కరిగిపోవడం గమనార్హం. దీంతో మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,56,72, 774.66 కోట్లకు పరిమితమైంది. శుక్రవారం ట్రేడింగ్లో విదేశీ సంస్థాగత మదుపరులు రూ.3,356.17 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్నారు.
8 వారాల కనిష్ఠానికి రూపాయి
డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 8 వారాల కనిష్ఠానికి పడిపోయింది. సోమవారం ఫారెక్స్ మార్కెట్ ట్రేడింగ్లో 28 పైసలు క్షీణించి 75.40 వద్ద నిలిచింది. ఒకానొక దశలో 75.45 వద్దకు పడిపోయినా.. తిరిగి స్వల్పంగా కోలుకున్నది. కాగా, మార్కెట్లో డాలర్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో రూపాయి మారకం విలువ వరుసగా పతనం కావడం ఇది మూడోసారి.