న్యూఢిల్లీ, మే 12 : దేశీయ స్టాక్ మార్కెట్ల నష్టాల పరంపర కొనసాగుతున్నది. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు మళ్లీ కమ్ముకుంటుండటంతో చమురు ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతుండటం మదుపర్లలో ఆందోళన పెంచింది. ఫలితంగా అమ్మకాలకు మొగ్గుచూపడంతో వరుసగా నాలుగోరోజూ మంగళవారం కూడా సూచీలు రెండు శాతానికి పైగా నష్టపోయాయి. ఇంట్రాడేలో 1,500 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 1,456.04 పాయింట్లు లేదా 1.92 శాతం కోల్పోయి 74,559.24 పాయింట్ల వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ కూడా 436.30 పాయింట్లు లేదా 1.83 శాతం పతనం చెంది 23,379.55 వద్ద స్థిరపడింది. వరుస పతనాలకు మదుపర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వరుసగా నాలుగు రోజుల్లో మదుపరులు ఏకంగా రూ.16.77 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. దీంతో బీఎస్ఈలో లిైస్టెన సంస్థల కంపెనీల విలువ రూ.16.77 లక్షల కోట్లు కరిగిపోయి రూ.4,56,02, 981.70 కోట్లు(4.77 ట్రిలియన్ డాలర్లు)కు జారుకున్నది. గత నాలుగు సెషన్లలో సెన్సెక్స్ 3,399.28 పాయింట్లు లేదా 4.36 శాతం కోల్పోయింది.
ఐటీ రంగ షేర్లు విలవిలలాడాయి. ఐటీ సంస్థల లాభాలపై ఏఐ తీవ్రస్థాయిలో ప్రతికూల ప్రభావం చూపనున్నదన్న అంచనాలు వెలువడటం ఈ రంగ షేర్లు తీవ్ర ఒత్తిళ్లకు గురయ్యాయి. దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన టెక్ మహీంద్రా షేరు అత్యధికంగా 4.44 శాతం నష్టపోయింది. దీంతోపాటు హెచ్సీఎల్ టెక్నాలజీ 4.11 శాతం, టీసీఎస్ 3.84 శాతం, విప్రో 3.59 శాతం, ఇన్ఫోసిస్ 3.09 శాతం, హెక్సావేర్ టెక్నాలజీ 1.42 శాతం చొప్పున పతనం చెందాయి. బీఎస్ఈ ఐటీ ఇండెక్స్ సూచీ ఏకంగా 4 శాతం వరకు నష్టపోయింది. ఏఐతో ఐటీ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని, దీంతో ఉద్యోగాలు పోవడంతోపాటు ఆయా సంస్థల లాభాలు తగ్గుముఖం పట్టనున్నాయని, దీంతో ఈ రంగ షేర్లు భారీగా పతనమయ్యాయని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. అమెరికాకు చెందిన ఏఐ సంస్థ కొత్తగా ఓపెన్ఏఐ కంపెనీని ప్రారంభించడం కూడా పతనానికి ఆజ్యంపోసింది.