న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశీయ ఎగుమతులు మళ్లీ జోరందుకున్నాయి. మార్చి నెలలో ఏకంగా 20 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఏకంగా 42.22 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. పెట్రోలియం, ఇంజినీరింగ్, లెదర్ ఉత్పత్తులకు విదేశాల్లో గిరాకీ అధికంగా ఉండటంతో అంతక్రితం ఏడాది ఇదే నెలలో అయిన 35.26 బిలియన్ డాలర్లతో పోలిస్తే 19.76 శాతం పెరిగాయని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. దేశీయ చరిత్రలో ఒక్క నెలలో 40 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరగడం ఇదే తొలిసారి. అలాగే గత నెలలో భారత్ 60.75 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నది కూడా. దీంతో వాణిజ్యలోటు 18.51 బిలియన్ డాలర్లు. గత నెలలో సేవల ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 4.64 శాతం అధికమై 21.76 బిలియన్ డాలర్లకు చేరాయి.
గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఎగుమతులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 2021-22లో 419.65 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఇదే సమయంలో 611.89 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు దిగుమతి అయ్యాయి. దీంతో వాణిజ్యలోటు 192.24 బిలియన్ డాలర్లు. అంతక్రితం ఏడాదిలో నమోదైన 102.63 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటుతో పోలిస్తే ఇంచుమించు రెండు రెట్లు పెరిగాయి.