Dollar Millionaires | దేశంలో డాలర్ మిలియనీర్ల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. 2020తో పోలిస్తే 2021లో 11 శాతం పెరిగింది. 4.58 లక్షల మంది వ్యక్తిగత సంపద 11 శాతం (రూ.7 కోట్లు) పెరిగింది. 350 మంది డాలర్ మిలియనీర్లపై హురున్ అనే సంస్థ సర్వే నిర్వహించింది. 130 కోట్ల మందికి పైగా జనాభా గల భారత్లో అసమానతలు పెరిగిపోతున్నాయని హురున్ పేర్కొంది. ఇంతకుముందు ఆక్స్ఫామ్ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యయనం ప్రకారం టాప్ సంపన్న భారతీయుల వ్యక్తిగత సంపద 775 బిలియన్ డాలర్లు. 4.6 కోట్ల మంది ప్రజలు గతేడాది దారిద్య్ర రేఖ దిగువకు పడిపోయారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 2026 నాటికి ఇండియన్ మిలియనీర్లు 30 శాతం పెరిగి ఆరు లక్షల కుటుంబాలకు చేరతాయని అంచనా వేసింది హురూన్.
దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నగరంలో 20,300 మంది డాలర్ మిలియనీర్లుగా నిలిచారు. ఢిల్లీలో 17,400, కోల్కతాలో 10,500 మంది డాలర్ మిలియనీర్లుగా అవతరించారు. అయితే మిలియనీర్లలో 19 శాతం మంది మాత్రం తమ సంపదలో కొంత దాతృత్వానికి ఖర్చు చేస్తున్నారు. మూడింట రెండొంతుల మంది సంపన్నులు తమ పిల్లలను ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు పంపడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అమెరికా మొదటి వరుసలో నిలుస్తుండగా, తర్వాత బ్రిటన్, న్యూజిలాండ్, జర్మనీ ఉన్నాయి.
మిలియనీర్లలో నాలుగో వంతు మంది ప్రతి మూడేండ్లకోసారి తాము వాడే కారు మార్చేస్తామని, అత్యధికంగా మెర్సిడెస్ బెంజ్ వాడతాం అని చెబుతున్నారు. రోలెక్స్ బ్రాండ్ వస్తువుల కలెక్షన్కు ప్రాధాన్యం ఇస్తామన్నారు. తమకు అత్యంత ఆతిథ్య కేంద్రంగా తాజ్ హోటల్స్ను పరిగణిస్తామని, ఫేవరెట్ జ్యువెల్లరీ బ్రాండ్గా తనిష్క్ నిలిచిందని హురూన్ తెలిపింది. ఇదిలా ఉంటే మిలియనీర్ల యూపీఐ పేమెంట్స్ రెట్టింపై 36 శాతానికి చేరాయి.