ODI World Cup 2023 : నాలుగేళ్లకు ఓసారి వచ్చే క్రికెట్ పండుగ వచ్చేస్తోంది. అదికూడా క్రికెట్ను మతంగా, క్రికెటర్లను దేవుళ్లుగా భావించే మన భారత గడ్డపై. మరో 8 రోజుల్లో ప్రపంచ కప్(ODI World Cup 2023) మహా సంగ్రామానికి తెరలేవనుంది. ట్రోఫీ కొట్టడమే లక్ష్యంగా అన్ని జట్లు తమ తరుపుముక్కలతో, అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్నాయి. స్టార్ ఆటగాళ్లు తమ బ్యాటింగ్ విన్యాసాలతో, ఫీల్డర్లు కళ్లు చెదిరే క్యాచ్లతో, బౌలర్లు స్టన్నింగ్ ఫెర్ఫార్మెన్స్తో అభిమానులను అలరించేందుకు విచ్చేస్తున్నారు. అయితే.. ఒంటిచేత్తో మ్యాచ్ను ములపు తిప్పే వీరులు, బంతితో నిప్పులు చెరిగే పేసర్లు కొందరు ఈ మోగా టోర్నీలో ఆడడం లేదు. అదొక్కటే ప్రతి ప్రేక్షకుడి బాధ. గాయం కారణంగా కలల ఈవెంట్కు దూరమైన ఆ స్టార్ ఆటగాళ్లు ఎవరంటే..?
భారత డాషింగ్ వికెట్ కీపర్ రిషభ్ పంత్(Rishabh Pant) ధనాధన్ ఇన్నింగ్స్లకు పెట్టింది పేరు. 2019 వరల్డ్ కప్(world cup 2019) తర్వాత పంత్ ఓ రేంజ్లో ఆడాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ గడ్డపై మెరుపు ఇన్నింగ్స్లతో జట్టును గెలిపించాడు. దాంతో, 2023 ప్రపంచ కప్(world cup 2023)లో అతడు టీమిండియా బలం అవుతాడని అనుకున్నారంతా. కానీ, అనూహ్యంగా ఈ లెఫ్ట్ హ్యాండర్ వరల్డ్ కప్ పోటీలకు దూరమయ్యాడు.
రిషభ్ పంత్
నిరుడు డిసెంబర్లో రూర్కీ సమీపంలో జరిగిన కారు యాక్సిడెంట్(Car Accident) అందుకు కారణం. మోకాలుకు బలమైన గాయం కావడంతో పంత్ ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం ఎన్సీఏ(NCA)లో కోలుకుంటున్నాడు. అతడి పునరాగమనానికి మరింత సమయం పట్టనుంది. ఒంటి చేత్తో జట్టును గెలిపించగల సత్తా ఉన్న పంత్ వరల్డ్ కప్ ఆడకపోవడం టీమిండియాకు పెద్ద లోటే అని చెప్పాలి.
శ్రీలంకకు ఎప్పటినుంచో స్పిన్నర్లు ప్రధాన ఆయుధంగా ఉంటున్నారు. మురళీధరన్, అజంత మెండిస్ తర్వాత వనిందు హసరంగ(Wanindu Hasaranga) రూపంలో ఆ జట్టుకు నాణ్యమైన స్పిన్నర్ దొరికాడు. హసరం అనతికాలంలోనే కీలక ఆటగాడిగా ఎదిగాడు. రెండు నెలల క్రితం జింబాబ్వే వేదికగా జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్(ODI World Cup Qualifiers 2023)లో ఈ ఆల్రౌండర్ చెలరేగాడు.
వనిందు హసరంగ
వరుసగా 5 వికెట్ల ప్రదర్శనతో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించాడు. అతడి స్పిన్ మాయతో లంక వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించింది. అలాంటిది వన్డే ప్రపంచ కప్ టోర్నీకి అతడు దూరం కావడం లంకకు పెద్ద నష్టమే. స్వదేశంలో జరిగిన లంక ప్రీమియర్ లీగ్(Lanka Premiere League)లో తొడ కండరాల గాయం(Harmstring Injury)తో హసరంగ మైదానం వీడాడు. అప్పటి నుంచి అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు.
క్రికెట్ పుట్టినిల్లు అయిన ఇంగ్లండ్ తొలిసారి 2019లో వరల్డ్ కప్ విజేతగా అవతరించింది. ఇయాన్ మోర్గాన్ సేన ట్రోఫీ అందుకోవడలో పేసర్ జోఫ్రా ఆర్చర్(Jofra Archer) పాత్ర ఎంతో ఉంది. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో స్కోర్లు సమం అయ్యాడు. దాంతో, సూపర్ ఓవర్ పెట్టారు. మొదట ఇంగ్లండ్ వికెట్ నష్టానికి 15 రన్స్ చేసింది. ఆ తర్వాత డెత్ ఓవర్ స్పెషలిస్ట్ అయిన ఆర్చర్కు మోర్గాన్ బంతి ఇచ్చాడు.
జోఫ్రా ఆర్చర్
సూపర్ ఓవర్లో ఈ పేసర్ 15 పరుగులే ఇచ్చి కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. సూపర్ ఓవర్ కూడా టై కావడంతో 26 బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్ను అంపైర్లు విజేతగా ప్రకటించారు. అయితే.. ఐపీఎల్ 16వ సీజన్కు ముందు ఆర్చర్ కుడి మోచేయికి గాయం అయింది. ఆ గాయం నుంచి అతను ఇంకా కోలుకోకపోవడంతో టోర్నీకి దూరమయ్యాడు.
జేసన్ రాయ్ – డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్(England) వరుసగా రెండో టైటిల్ వేటకు సిద్ధమవుతోంది. కానీ, టోర్నీ ఆరంభానికి ముందే ఆ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్(Jason Roy) గాయంతో మెగా టోర్నీకి దూరం అయ్యాడు. ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో 33 ఏళ్ల రాయ్ దంచి కొట్టాడు.
జేసన్ రాయ్
రహ్మనుల్లా గుర్బాజ్తో కలిసి కోల్కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders)కు శుభారంభాలు ఇచ్చాడు. దాంతో, ఇంగ్లండ్ జట్టు వరల్డ్ కప్లో అతడిపై భారీ ఆశలు పెట్టుకుంది. కానీ, అనూహ్యంగా కండరాల నొప్పితో రాయ్ టోర్నీకి దూరయమ్యాడు. ఇక్కడితో అతడి అంతర్జాతీయ కెరీర్ ముగిసిన్టే అని కొందరు అభిప్రాయపడుతున్నారు. రాయ్ స్థానంలో విధ్వంసక బ్యాటర్ హ్యారీ బ్రూక్ (Harry Brook) ఎంపికయ్యాడు.
ఏళ్లుగా అందని ద్రాక్షలా ఊరిస్తున్న వరల్డ్ కప్ను ఒడిసిపట్టుకునేదుకు దక్షిణాఫ్రికా ఈసారి భారీ కసరత్తులు చేసింది. అన్ని కుదిరాయి అనుకున్న సమయంలో ప్రధాన పేసర్లలో ఒకడైన అన్రిచ్ నార్ట్జ్(Anrich Nortje) గాయపడ్డాడు. అది సఫారీ జట్టకు కోలుకోలేని దెబ్బ. ఎందుకంటే.. ఐపీఎల్లో ఈ స్టార్ పేసర్ అద్భుతంగా రాణించాడు.
అన్రిచ్ నార్ట్జ్, మగల
భారత పిచ్లపై అతడికి మెరుగైన రికార్డు ఉంది. మరో ఫాస్ట్ బౌలర్ సిసండ మగల(Sisanda Magala) కూడా గాయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. దాంతో, నార్ట్జ్, మగల స్థానంలో అండిలే పెహ్లూవాకియో(Andile Phehlukwayo), లిజాద్ విల్లియమ్స్(Lizaad Williams)లను ఎంపిక చేశారు.
పాక్ పేస్ త్రయంలో యువ పేసర్ నసీం షా(Naseem Shah) ఒకడు. సూపర్ ఫామ్లో ఉన్న ఈ యంగ్స్టర్ ప్రపంచ కప్(ODI World Cup 2023)పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. అయితే.. గాయం రూపంలో అతడిని దురదృష్టం వెంటాడింది. ఆసియా కప్లో భారత జట్టుతో జరిగిన సూపర్ 4 మ్యాచ్లో నసీం గాయపడ్డాడు.
నసీం షా
ఈ పేసర్ వరల్డ్ కప్తో పాటు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్, పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL) 2024కు అందుబాటులో ఉండు. ప్రపంచ కప్ కోసం నసీం స్థానంలో పాక్ సెలెక్టర్లు హసన్ అలీ(Hasan Ali)ని 15 మంది స్క్వాడ్లోకి ఎంపిక చేశారు.
న్యూజిలాండ్ క్రికెట్లో స్పిన్ ఆల్రౌండర్ మైఖేల్ బ్రాస్వెల్(Michael Bracewell) ఓ సంచలనం. ఈ యంగ్స్టర్ ఈ ఏడాది భారత్పై విధ్వసంక బ్యాటింగ్తో ఔరా అనిపించాడు. ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో మెరుపు సెంచరీతో వార్తల్లో నిలిచాడు.
మైఖేల్ బ్రాస్వెల్
ప్రపంచ కప్లో బ్రాస్వెల్ తమ తురుపుముక్క అవుతాడని కివీస్ భావించింది. కానీ, గాయంతో అతడు 15మంది బృందంలో చోటు దక్కించుకోలేకపోయాడు. అంతేకాదు 2020 డబ్ల్యూటీసీ ఫైనల్ హీరో, ఆల్రౌండర్ కైల్ జేమీసన్, ఆడం మిల్నేలు తమ కలల ఈవెంట్కు దూరమయ్యారు.