ఇంద్రవెల్లి, మార్చి 6 : ఆదివాసీ గిరిజనులు తమ ఆచార వ్యవహారాలను పాటించాలని, కట్న కానుకలు తీసుకోవద్దని వడగాం రాయిసెంటర్ సమావేశంలో ఆదివాసీ గిరిజనులు తీర్మానించారు. మండలకేంద్రంలోని వడగాం రాయిసెంటర్ సార్మేడి మెస్రం చిన్ను, వడగాం గ్రామపటేల్ ఆత్రం మారుతీపటేల్ అధ్యక్షతన ఆదివారం రాయిసెంటర్ సమావేశం నిర్వహించారు. ఆదివాసీ గిరిజన సంస్కృతీ సంప్రదాయాలతోపాటు ఆచార వ్యవహారాలు, సంప్రదాయ వివాహాల నిర్వహణ, పెండ్లిల్లో ధరించే దుస్తులు, ఇచ్చే కట్న కానుకలపై చర్చించారు. పెండ్లి చూపులకు 10 మంది కంటే ఎక్కువ పోరాదని, వధువును పెండ్లికి ఒకరోజు ముందు మాత్రమే పంపాలని తీర్మానించారు. పసుపుతో కలిపిన బియ్యం మాత్రమే అక్షింతలకు వాడాలని, వివాహ కార్యక్రమాల్లో కేవలం నాలుగు డోల్లు మాత్రమే ఉండాలని పేర్కొన్నారు. ఆదివాసీ గిరిజనులు నిర్వహించే పెండ్లిల్లో కట్న కానుకలు, వస్తువులు, వాహనాలు తీసుకోవద్దని, పెండ్లి కొడుకు ఆదివాసీ సంప్రదాయ దుస్తులు ధరించాలని తీర్మానించారు. ఆదివాసీ గిరిజనులు మోగోజీ, జంగు, బాదుదేవారి, జాకు మహాజన్, లచ్చుపటేల్, జంగు బాపు, మోతీరాం, గంగారాం, భరత్, జాలీం, మధుకర్ పాల్గొన్నారు.