సిటీబ్యూరో, ఫిబ్రవరి 17(నమస్తే తెలంగాణ): ప్లాస్టర్ ఆఫ్ పారిస్, క్లే పదార్థాలతో గణేశ్ విగ్రహాలను తయారు చేయవద్దని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. గురువారం గచ్చిబౌలి పోలీసు కమిషనర్ కార్యాలయంలో వినాయక విగ్రహాల తయారీదారులతో బల్దియా కమిషనర్ లోకేశ్కుమార్తో కలిసి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని దెబ్బతిసే ప్లాస్టర్ ఆఫ్ పారిస్, ఇతర రసాయన సామగ్రిని విగ్రహాల తయారీలో వాడొద్దని సీపీ స్పష్టం చేశారు. డీసీపీ స్థాయి పోలీసు అధికారితో పాటు జీహెచ్ఎంసీ, ఇతర విభాగాల అధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేసి.. వారి ఆధ్వర్యంలో తయారీదారులకు సహజమైన సామగ్రితో ఈకో ఫ్రెండ్లీ గణేశ్ విగ్రహాల తయారీ పై శిక్షణ ఇప్పిస్తామన్నారు. తయారీదారుల నుంచి జీహెచ్ఎంసీ తరఫున 5 లక్షల విగ్రహాలను కొనుగోలు చేసి.. పంపిణీ చేస్తామని బల్దియా కమిషనర్ లోకేశ్కుమార్ తెలిపారు. ఈకో ఫ్రెండ్లీ గణేశ్ విగ్రహాల తయారీదారులకు అనేక ప్రోత్సాహకాలు, ఇన్ఫుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్టు సత్యనారాయణరావు, జడ్సీలు ప్రియాంక అలా, మమత, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి తదితరులు పాల్గొన్నారు.