యాదాద్రి, మార్చి 24 : ధాన్యం కొనుగోలుకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కేంద్రంపై మరో పోరుకు నియోజకవర్గ ప్రజలు సిద్ధం కావాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలో గురువారం నిర్వహించిన టీఆర్ఎస్ ఆలేరు నియోజకవర్గ సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతి గ్రామ పంచాయతీ, ఎంపీడీఓ, మార్కెట్ కమిటీ, రైతు సంఘాలు, టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయాలని, ఇందుకోసం తీర్మానాలు చేసి పార్టీ మండల అధ్యక్షులకు అందించాలన్నారు. ‘తెలంగాణ రైతాంగం పండించిన పంటలను పంజాబ్ తరహాలో కొనుగోలు చేయాలి’ అని మోదీని కోరుతూ ఆంగ్ల భాషలో లేఖలు పంపించాలన్నారు. మోదీ కేవలం గుజరాత్కు మాత్రమే ప్రధాని కాదనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. దేశాన్ని ఆకలి రాజ్యం చేసేలా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయని మండిపడ్డారు. కేంద్ర రైతు వ్యతిరేక విధానాలపై అన్నదాతలు ఉద్యమించాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం కేసీఆర్ రైతులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. ప్రతి రైతు కుటుంబానికి కేసీఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయని గుర్తు చేశారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్టులు నమోదు చేసి రైతన్నకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్పై ప్రజాదరణ చూసి రేవంత్రెడ్డి పిచ్చకూతలు కూస్తున్నాడని, చిత్తశుద్ధి ఉంటే రైతు సమస్యలపై కేంద్రంపై కొట్లాడాలని హితవు పలికారు. బీజేపీ నాయకుల ఆరోపణలకు అర్థం పర్ధం లేకుండా ఉన్నాయన్నారు. ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని మాట్లాడుతున్న బండి సంజయ్, ఢిల్లీకి వెళ్లి ధాన్యాన్ని పూర్తిగా కేంద్రమే కొంటుందని దొంగ నాటకాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. నిరుద్యోగ వ్యవస్థ రూపు మాపేందుకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిందని, ప్రతి నిరుద్యోగి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యోగార్థుల కోసం ఆలేరు పట్టణంలో ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. కార్యక్రమంలో డీఎల్డీఏ చైర్మన్ మోతె పిచ్చిరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ బీకూనాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, టీఆర్ఎస్ వివిధ మండలాల అధ్యక్షులు కర్రె వెంకటయ్య, బొట్ల యాదయ్య, వెంకటేశ్గౌడ్, నరేందర్రెడ్డి, గంగుల శ్రీనివాస్, ఖలీల్, జడ్పీటీసీలు తోటకూరి అనూరాధ, పల్లా వెంకట్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధ, ఆలేరు మున్సిపల్ చైర్మన్ శంకరయ్య, రైతుబంధు సమితి సభ్యులు మిట్ట వెంకటయ్య, భూమండ్ల అయిలయ్య, నాయకులు వంటేరు సురేశ్రెడ్డి, కసావు శ్రీనివాస్గౌడ్, పెలిమెల్లి శ్రీధర్గౌడ్, సతీశ్యాదవ్ పాల్గొన్నారు.
ప్రతి ధాన్యం గింజను కేంద్రం కొనాల్సిందేనని ఈ నెల 27న గ్రామ పంచాయతీల్లో, 28న మండల, 29న జల్లా పరిషత్, మున్సిపల్ సమావేశాల్లో తీర్మానాలు చేయాలని డీసీసీబీ చైర్మన్, టెస్కాబ్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి పిలుపునిచ్చారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే కేంద్రం రైతులను ఇబ్బంది పెట్టే విధానాలు అవలంబిస్తున్నదని విమర్శించారు. ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు పోరాటం ఆగదన్నారు. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ ప్రజల కోసమే పనిచేసే ఏకైక వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు. దేశంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వని విధంగా రైతులకు రైతుబంధు ఇస్తున్నారన్నారు. 90వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వడం చాలా గొప్ప విషయమన్నారు.