ఆలోచన ఉండాలేకాని అద్భుతాలు చేయవచ్చు. మనవద్ద వనరుల్లేకున్నా ఇతరుల సాయంతో అనుకున్నది అమలు చేసి చూపించి శెభాష్ అనిపించుకోవచ్చు. పాలిథిన్ కవర్తో మొక్క నాటడడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని భావించి వృథాగా పోయే పల్లీపొట్టుతో పాట్స్(చిన్నపాటి కుండి)లను తయారు చేసింది ప్రభుత్వ పాఠశాలలో అభ్యసిస్తున్న పదోతరగతి విద్యార్థిని. తన ఆలోచనకు ప్రభుత్వం తోడవడంతో క్రమంగా అన్ని నర్సరీల్లో పర్యావరణానికి మేలు చేసే కుండీలు అందుబాటులోకి రానున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లా చింతలకుంట గ్రామం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న శ్రీజ.. ఒకరోజు ఉపాధ్యాయులు,తోటి విద్యార్థులతో కలిసి మొక్కలు నాటుతోంది. పాలిథిన్ కవర్తో ఉన్న మొక్కను చూడగానే వినూత్న
ఆలోచన కలిగింది. కవర్లు భూమిలో కలిసిపోయి పర్యావరణానికి హాని కలిగిస్తాయని భావించింది.
పాలిథిన్కు ప్రత్యామ్నాయంగా బయోడిగ్రేడబుల్ పాట్స్
“ పాలిథిన్తో పర్యావరణానికి ముప్పు అన్న విషయం గుర్తుకొచ్చి ప్రత్యామ్నాయం తయారు చేయాలని ఆలోచించా. ఈ విషయాన్ని మ్యాథ్స్ సార్ ఆగస్టన్ దృష్టికి తీసుకెళ్లా. ఆయన ఎలా చేస్తావు? సాధ్యమేనా అని ప్రశ్నించగా.. వెంటనే మా ఊరిలో వృథాగా వదిలేసే వేరుశెనగ (పల్లీ) పొట్టు గుర్తుకొచ్చింది. వేస్ట్గా పోతున్న ఆ పొట్టును ఎలాగైనా వినియోగించి పాట్స్(కుండీలు) తయారు చేయాలనుకున్నా. మొదట చేతులతో తయారు చేయడం వల్ల రోజుకు 10 పాట్స్ మాత్రమే చేయగలిగాను. అప్పుడే తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నిర్వహిస్తున్న ‘ఇంటింటా ఇన్నోవేటర్’ ప్రొగ్రామ్కు దరఖాస్తు చేసుకున్నా. కొద్దిరోజుల్లోనే ఎంపికవ్వడం, టీఎస్ఐసీ, టీ-వర్క్స్ సహకారంతో నా ఆలోచన పరిపూర్ణతతో బయోడిగ్రేడబుల్ పాట్స్ను తయారు చేశా. నర్సరీల్లో పాలిథిన్ కవర్లకు బదులు కొత్తరకం పాట్స్ని వినియోగించవచ్చు. హరితహారంలో వినియోగించే మొక్కలకు ఈ పాట్స్ని వినియోగించడం వల్ల చాలావరకు పాలిథిన్ కవర్ల వినియోగాన్ని నివారించొచ్చు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో బయోడిగ్రేడబుల్ పాట్స్ తయారీ పరిశ్రమను నెలకొల్పి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కృషి చేస్తా” అని శ్రీజ పేర్కొంది.
కుండీతో కలిసి పాతవచ్చు..
సాధారణ మట్టి కుండీల్లాగే వేరుశనగ పొట్టుతో తయారుచేసిన పాట్స్లలో అన్నిరకాల మొక్కలను పెంచడంతోపాటు, పాట్స్తో కలిపి పాతవచ్చు. పాట్స్ 20 నుంచి 30 రోజుల్లో భూమిలో కలిసిపోవడం వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలుగదు. శ్రీజ ఆలోచనలను తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నిర్వహిస్తున్న ‘ఇంటింటా ఇన్నోవేటర్’ ప్రొగ్రామ్ ద్వారా టీ-వర్క్స్కు అనుసంధానం చేయడంతో వీరందరి కలయికలో అద్భుత ఆవిష్కరణకు నాంది పడింది. మాదాపూర్లోని జీఈ ఐప్లెన్స్ ఐటీ సంస్థ ఆవరణలో టీఎస్ఐసీ, టీ-వర్క్స్లు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో బయోడిగ్రేడబుల్ పాట్స్ తయారీని వివరించారు. తన ఆలోచనకనుగుణంగా శ్రీజ పాట్స్ని స్వయంగా తయారు చేసి చూపించింది. భవిష్యత్తులో మరింత ముందుకు తీసుకెళ్లేలా అవసరమైన పరికరాలను జీఈ ఆైప్లెన్స్ సంస్థ శ్రీజకు అందజేసింది.
ఆలోచన అమలే ప్రధానం
చిన్నారుల్లో వచ్చిన ఆలోచన చెబితే తేలికగా తీసుకోవద్దు. శ్రీజకు వచ్చిన ఆలోచన గ్లోబల్ సమస్యకు పరిష్కారంగా మారింది. ఆ ఆలోచనను నాతో పంచుకున్న వెంటనే మరింత లోతుగా పరిశోధించి బయోడిగ్రేడబుల్ పాట్స్ను ఆవిష్కరించాం. రాష్ట్ర ప్రభుత్వం, టీఎస్ఐసీ, టీ-వర్క్స్ సహకారం మరువలేనిది. పాట్స్ తయారీకి శ్రీజ ఎంత కష్టపడిందో వారు కూడా అంతే కష్టపడ్డారనడంలో సందేహం లేదు.
ఆవిష్కరణలకు అండగా
సరికొత్త, వినూత్న ఆలోచనలతో వస్తున్న వారి ఆవిష్కరణలకు తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) అండగా ఉంటుంది. ప్రతి ఆగస్టు మాసంలో ‘ఇంటింటా ఇన్నోవేటర్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వినూత్న, సరికొత్త ఆలోచనలను ఆవిష్కరించేందుకు ఎంపిక చేసి వారికి అవసరమైన సహాయ,సహకారాలను అందిస్తున్నాం. అందరి శ్రమ ఫలితమే బయోడి గ్రేడబుల్ పాట్స్ తయారీ. హరితహారంలో ఈ పాట్స్ వినియోగంపై ప్రభుత్వంతో చర్చిస్తాం. పాట్స్ని కేవలం జిల్లా,రాష్ర్టానికే కాకుండా దేశం మొత్తానికి అందించేలా ఇండస్ట్రీని ప్రారంభించేందుకు శ్రీజకు అండగా ఉంటాం.
-డాక్టర్ శాంత తౌటం, చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్