హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): కరోనా మూడోవేవ్పై ఆందోళన అవసరం లేదని వైద్యారోగ్య నిపుణులు అంటున్నారు. ఏవై 4.2 వేరియంట్ అంతగా ప్రభావవంతమైంది కాదని వెల్లడించారు. యూరప్ దేశాల్లో వ్యాక్సినేషన్ పూర్తిస్థాయిలో జరగకపోవడం, కొవిడ్ నిబంధనలు సరిగ్గా పాటించకపోవటం వల్ల కేసులు పెరుగుతున్నాయని చెప్తున్నారు. డెల్టా వేరియంట్లో 67 ఏవై రకానికి చెందిన వేరియంట్లు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది. ఇవి 21ఏ, 21 ఐ, 21జే అనే మూడు ఉప వర్గాలకు చెందినవి. ఏవై 4.2 అనేది 21 ఐ రకానికి చెందినది. ప్రపంచంలో 21 జే రకానికి చెందిన కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అసలైన డెల్టా 21ఏ రకానికి చెందినది. మనదేశంలో ఏవై 4.2 రకానికి చెందిన వేరియంట్ కేసులు ఈ ఏడాది జూన్లోనే నమోదయ్యాయి. రాష్ట్రంలో సెప్టెంబర్లో 2 రెండు కేసులు గుర్తించారు. జూన్ నుంచి ఇప్పటివరకు ఏవై 4.2 వేరియంట్ మనదేశంలో పెద్దగా ప్రభావం చూపలేదని నిపుణులు చెప్తున్నారు.
స్వదేశీ వేరియంట్లతోనే ముప్పు
ఏవై 4.2 వేరియంట్ను తొలుత మే 13న ఇంగ్లాండ్లో గుర్తించారు. అది క్రమంగా యూరప్ మొత్తం వ్యాప్తించింది. మనదేశంలో మాత్రం ప్రభావం చూపడంలేదు. మనదేశంలో పుట్టిన డెల్టా వేరియంట్ రెండోవేవ్ రూపంలో ప్రపంచాన్ని వణికించింది. ఇప్పుడు మనదగ్గర అంతకంటే బలమైన వేరియంట్ పుడితేనే మూడోవేవ్ ప్రభావం ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. అప్పటివరకు ఎలాంటి ప్రమాదం లేదని భరోసా ఇస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వ్యాక్సినేషన్ సరిగ్గా జరగటం లేదు. బల్గేరియాలో 24 శాతం వ్యాక్సినేషన్ ఉంటే ఐర్లాండ్లో 92 శాతం ఉన్నది. అమెరికాలోని ఫ్లోరిడాలో అధిక మరణాలకు వ్యాక్సినేషన్ వ్యతిరేక ఉద్యమం ఒక కారణం. వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
రెండు డోసులు తీసుకుంటేనే రక్షణ
కరోనా కేసులు తగ్గుముఖం పట్టేసరికి వ్యాక్సిన్ తీసుకోవడం పట్ల కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మొదటి డోసు విషయంలో శ్రద్ధ చూపిన వారు రెండో డోసు వేసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎన్ని వేరియంట్లు వచ్చినా వ్యాక్సిన్ వేసుకుంటే సురక్షితంగా ఉండొచ్చు. రెండు డోసులు తీసుకున్నప్పుడే పూర్తిస్థాయి రక్షణ లభిస్తుంది. మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా ఉంచుకోవటం వల్ల కరోనాతోపాటు ఇతర వ్యాధులు ధరిచేరకుండా చూసుకోవచ్చు.
మూడో వేవ్ ప్రమాదం లేదు
ఏవై 4.2 వేరియంట్ వల్లనే విదేశాల్లో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయనటం వాస్తవం కాదు. మనదేశంలో దాని ప్రభావం లేదు. కాబట్టి ఇది మూడోవేవ్కు కారణమవుతుందనే ఆందోళన అవసరంలేదు. మనదేశంలో పుట్టే బలమైన వేరియంట్ మనకు ప్రమాదంగా మారే అవకాశం ఉన్నది. వచ్చే మూడు నెలల దాకా మూడోవేవ్ ప్రమాదం లేదని మాత్రం చెప్పొచ్చు.