హిమాయత్నగర్, జనవరి 22: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. హిమాయత్నగర్లోని మఖ్ధుం భవన్లో అగ్రిగోల్డ్ బాధితులు శనివారం చాడ వెంకట్రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్ అవసరాల కోసం ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలు కూడబెట్టుకున్న సొమ్మును అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిట్ల రూపంలో సేకరించి తిరిగి చెల్లించకపోవడం అన్యాయమన్నారు. ఈ అంశంపై ఈనెల 26న మఖ్ధుం భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.బాల మల్లేశ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రజిత, సునీత, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోగుల వెంకటేశ్వరరావు, నాయకుడు రామారావు పాల్గొన్నారు.