వాషింగ్టన్, ఏప్రిల్ 1: వైద్యశాస్త్రంలో నవ చరిత్ర ఆవిష్కృతమైంది. కొన్నేండ్లుగా శాస్త్రవేత్తలకు అంతుచిక్కకుండా దాగుడుమూతలు ఆడిన డీఎన్ఏ గుట్టు తెలిసొచ్చింది. మొట్టమొదటిసారిగా మానవుల జన్యురాశిని శాస్త్రవేత్తలు పూర్తిస్థాయిలో ఆవిష్కరించారు. ప్రపంచంలోని ప్రఖ్యాత జీవశాస్త్రవేత్తలు బృందంగా ఏర్పడిన టెలోమేర్-టూ-టెలోమేర్ (టీ2టీ) కన్సార్టియమ్ ఈ ఘనత సాధించింది. ఈ వివరాలు ‘జర్నల్ సైన్స్’లో ప్రచురితమయ్యాయి.
డీఎన్ఏ గుట్టు తెలుసుకోవడానికి కొన్నేండ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. 2003లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. మనిషి డీఎన్ఏ గుట్టును 92% వరకు పరిశోధకులు విశ్లేషించగలిగారు. మిగతా 8% డీఎన్ఏ చిన్న ముక్కలుగా ఒకదానిపై ఒకటి ఉండటంతో దాన్ని పరిష్కరించలేకపోయారు. అందులోని 20 కోట్ల జన్యువుల జాడను కనిపెట్టలేకపోయారు. వ్యాధికారక సూక్ష్మజీవులు ఈ జన్యువుల సాయంతోనే ఉత్పరివర్తనం చెందడం ప్రారంభించాయి. పరిశోధనలను తీవ్రంచేసిన శాస్త్రవేత్తలు 300 కోట్ల డీఎన్ఎ జన్యుక్రమ జతలను విశ్లేషించి.. 20 ఏండ్లపాటు శ్రమించి చివరకు మానవుల జన్యురాశిని పూర్తిస్థాయిలో ఆవిష్కరించారు.
క్యాన్సర్ సోకిన ఇద్దరికి ఒకేస్థాయి ట్రీట్మెంట్ ఇచ్చాం అనుకొందాం. చికిత్సకు మొదటి వ్యక్తి స్పందించినప్పటికీ, రెండో వ్యక్తి స్పందించట్లేదు. రెండో వ్యక్తిలో వ్యాధి క్రమంగా ముదురుతుంది. దీనికి కారణం వ్యాధికి కారణమైన వైరస్.. రోగి కణాల్లో దోబూచులాడుతూ ఉత్పరివర్తనం చెందడమే. అయితే, తాజా ఆవిష్కరణతో రెండోవ్యక్తి జన్యుక్రమంపై పూర్తి అవగాహన ఉండటం వల్ల రోగనిరోధకతను దెబ్బతీస్తున్న వైరస్ మ్యుటేషన్ల గుట్టును సులభంగా కనుగొనవచ్చు. తద్వారా వ్యాధిని నయం చేయడానికి ట్రీట్మెంట్ను మెరుగుపర్చవచ్చు. వ్యాధులను జన్యుక్రమాల సాయంతో నయం చేసే మార్గాలను అభివృద్ధి చేయవచ్చు.
తాజా ఆవిష్కరణ మనుషుల పూర్తిస్థాయి డీఎన్ఏ బ్లూప్రింట్. దీంతో ప్రపంచంలోని 790 కోట్ల మంది జన్యువైరుధ్యాలను లోతుగా విశ్లేషించవచ్చు. తద్వారా ప్రాణాంతక వ్యాధులను నయం చేయవచ్చు.
-ఎరిక్గ్రీన్, నేషనల్ హ్యూమన్ జీనోమ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్