తమిళనాడు : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డీఎంకే కూటమికి చేసిన మోసానికి ప్రతీకార చర్యలకు డీఎంకే సమాయత్తమవుతున్నది. డీఎంకే మద్దతుతో మున్సిపాలిటీ లాంటి స్థానిక సంస్థల పదవుల్లో ఉన్న కాంగ్రెస్ స్థానాలకు ఎసరుపెడుతూ నిర్ణయం తీసుకుంది. డీఎంకే మద్దతుతో ఉన్న కుంభకోణం కాంగ్రెస్ పార్టీ మేయర్ శరవణన్ను తొలగించేందుకు పావులు కదుపుతున్నది. కాగా, అధికారంలో భాగం కోసం కాంగ్రెస్ నిస్సిగ్గుగా కప్పదాటు చర్యకు పాల్పడింది.
ఇన్నాళ్లు తాము ఉంటున్న డీఎంకే కూటమిని విడిచిపెట్టి విజయ్కు చెందిన టీవీకేతో చేతులు కలుపుతున్నట్టు బుధవారం ప్రకటించింది. రెండు పార్టీల మధ్య పరస్పర గౌరవం, సముచిత వాటా, భాగస్వామ బాధ్యత ఆధారంగా ఈ పొత్తు ఉంటుందని తెలిపింది. కాగా, రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదు సీట్లను గెల్చుకుంది. ప్రస్తుతం అధికారాన్ని చేపట్టేందుకు మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్ల దూరంలో టీవీకే ఆగిపోయిన క్రమంలో కాంగ్రెస్ ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించింది.
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలంటూ టీవీకే నేత విజయ్ తమను అధికారికంగా కోరారని తమిళనాడు కాంగ్రెస్ ఇన్చార్జి గిరీశ్ చోదంకర్ ఎక్స్లో తెలిపారు. దీంతో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ, కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ కలిసి టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని మంగళవారం జరిపిన అత్యవసర సమావేశంలో నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. బీజేపీ, దాని మిత్ర పక్షాలు నడిపే ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండరాదన్న నిర్ణయానికి తాము కట్టుబడి ఉన్నామని, అందుకే లౌకిక ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. చిరకాలంగా ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న డీఎంకేను కాంగ్రెస్ విడిచిపెట్టడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.