రూ.450 కోట్ల నుంచి రూ.1750 కోట్ల టర్నోవర్
మహిళా సంఘాలకు రూ.10 నుంచి 20 లక్షల వరకు రుణాలు
రాష్ట్ర స్థాయి బెస్ట్ బ్యాంక్ అవార్డును అందజేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి
సంగారెడ్డి అర్బన్, మే 19: మహిళా సమాక్య సంఘాల అభివృద్ధికి విశేష సేవలందించినందుకు ఉమ్మడి మెదక్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు రాష్ట్రస్థాయి అవార్డు వరించింది. ఈ అవార్డును డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డికి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అందజేశారు. సంగారెడ్డిలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సంఘాలకు ఎలాంటి షూరిటీ లేకుండా బ్యాంకు రుణాలిచ్చేందుకు ఉమ్మడి మెదక్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సిద్ధంగా ఉందన్నారు. బ్యాంకు సేవలు వినియోగించుకుని చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మహిళా సంఘాలకు ఆయన పిలుపునిచ్చారు.
రూ.1750 కోట్ల టర్నోవర్
డీసీసీబీకి వరుస అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు. రూ.450 కోట్ల టర్నోవర్ ఉన్న బ్యాంకును రూ.1750 కోట్లకు తీసుకెళ్లామన్నారు. రూ.2వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. మహిళా గ్రూప్లకు రుణాలు అందించడంలో 2019-20 రాష్ట్ర ప్రభుత్వ అవార్డు, 2021లో నేషనల్ అవార్డు, 2021-22లో బెస్ట్ చైర్మన్ అవార్డు, ఇప్పుడు బెస్ట్ బ్యాంక్ అవార్డులు తీసుకోవడం గర్వంగా ఉందన్నారు. మహిళా గ్రూప్లకు ఇచ్చే రుణాలను రూ.10 నుంచి 12 లక్షలకు పెంచామని, వీలును బట్టి రూ.20లక్షల వరకు రుణాలిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామ ని అన్నారు. 2021-22గాను 10,310 మహిళా గ్రూప్లకు రూ.325 కోట్ల 40లక్షల రుణాలు అందజేశామన్నారు. 2022-23గాను రూ.600 కోట్ల రుణాలిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. 4-5 మహిళా సంఘాలు గ్రూపుగా ఏర్పడి పాల డెయిరీలు, కూరగాయల సాగు, పసుపు, మిర్చి పౌడర్ చేసే మిషన్ల ఏర్పాటు, పప్పు దినుసుల వ్యాపారాలు చేస్తే మంచి లాభాలు వస్తాయన్నారు. ఈ అవార్డులు రావడానికి కృషి చేసిన ఉద్యోగులు, సిబ్బందిని ఆయన అభినందించారు. సమావేశంలో డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, సీఈఓ శ్రీనివాస్వాస్ పాల్గొన్నారు.