హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): రేషన్ దుకాణాల్లో ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక బియ్యం)ను తొలిదశలో ఏప్రిల్ నుంచి 11 జిల్లాల్లో పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఈ బియ్యాన్నే పంపిణీ చేస్తామని తెలిపారు. ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీపై మంగళవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి గంగుల మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసినట్టు తెలిపారు. ఇప్పుడు వీటితోపాటు రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండ, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, వికారాబాద్ జిల్లాల్లో ఏప్రిల్ నుంచి ఫోర్టిఫైడ్ రైస్ పంపిణీని ప్రారంభిస్తామని చెప్పారు. మిగిలిన జిల్లాల్లో 2024 మార్చిలోపు దశలవారీగా పంపిణీ చేస్తామని తెలిపారు.