న్యూఢిల్లీ: సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో హైదరాబాద్ పోరాటం ముగిసింది. ఓటమన్నదే లేకుండా సెమీఫైనల్కు చేరుకున్న హైదరాబాద్కు డిఫెండింగ్ చాంపియన్ తమిళనాడు చెక్ పెట్టింది. శనివారం తొలి సెమీస్లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో తమిళనాడు చేతిలో ఓటమిపాలైంది. శరవణ కుమార్(5/21) ధాటికి హైదరాబాద్ 18.3 ఓవర్లలో 90 పరుగులకే కుప్పకూలింది. ఆఖర్లో తనయ్ త్యాగరాజన్(25) బ్యాటు ఝులిపించడంతో గౌరవప్రదమైన స్కోరు దక్కింది. అశ్విన్(2/13), మహమ్మద్(2/12) రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనలో తమిళనాడు..సుదర్శన్(34 నాటౌట్), కెప్టెన్ శంకర్(43 నాటౌట్) రాణింపుతో 14.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. మరో సెమీస్లో విదర్భపై కర్ణాటక 4 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. తమిళనాడు, కర్ణాటక మధ్య సోమవారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.