షాద్నగర్, డిసెంబర్ 5 : మరోమారు దిశ ఎన్కౌంటర్ ఘటన చర్చనీయాశంగా మారింది. దిశ ఘటనను క్షేత్రస్థాయిలో విచారించే క్రమంలో సిర్పూర్కర్ కమిషన్ సభ్యులు ఆదివారం షాద్నగర్ శివారు చటాన్పల్లి పరిధిలో జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ స్థలాన్ని పరిశీలించారు. ముందుగా శంషాబాద్ మండలం తొండుపల్లి సమీపంలో దిశపై జరిగిన హత్యాచారస్థలాన్ని పరిశీలించిన సభ్యులు అక్కడి నుంచి షాద్నగర్ బైపాస్ మీదుగా చటాన్పల్లి చేరుకున్నారు. మొదటగా దిశ మృతదేఁం పడేసిన ప్రాంతాన్ని పరిశీలించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ, ఆ ప్రాంతమంతా చెరువు నీళ్లు ఉండడంతో కమిషన్ సభ్యులు నిందితులను ఎన్కౌంటర్ చేసిన ప్రాంతానికి వెళ్లారు. నిందితులు నలుగురు ఏ ప్రాంతంలో మృతిచెందారు? ఎలా తప్పించుకునేందుకు ప్రయత్నించారు? బైపాస్ రోడ్డు నుంచి ఎన్కౌంటర్ స్థలానికి ఎలా వచ్చారు? అనే అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. ఇందులో భాగంగా దిశ సిట్ బృందం ప్రధాన పోలీస్ అధికారి, రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ నిందితుల ఎన్కౌంటర్కు దారితీసిన పరిస్థితులు, ఎన్కౌంటర్ తీరు, సంఘటన స్థలంలో నిందితులు వ్యవహరించిన తీరు వంటి అంశాలను కమిషన్ సభ్యులకు వివరించినట్లు తెలిసింది. ఎన్కౌంటర్ ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం కమిషన్ సభ్యులు నేరుగా షాద్నగర్ బైపాస్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ హోటల్లో 30 నిమిషాల పాటు సేదతీరారు. అక్కడి నుంచి పట్టణంలోని షాద్నగర్ పట్టణ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీస్స్టేషన్ పరిసరాలను పరిశీలించి నిందితులు వ్యవహరించిన తీరుపై సంబంధిత అధికారులతో ఆరా తీసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే దిశ సంఘటన నిందితులకు అనుకూలంగా వ్యవహరించే విధంగా సిర్పూర్కర్ కమిషన్ పనిచేస్తున్నదని ఆరోపిస్తూ షాద్నగర్ ప్రజా సంఘాల నాయకులు షాద్నగర్ పోలీస్స్టేషన్ ఎదుట నిరసనలు తెలిపారు. కమిషన్ సభ్యులు పోలీస్స్టేషన్ను పరిశీలిస్తుండగా కమిషన్ సభ్యుల పనితీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గో బ్యాక్ కమిషన్ అంటూ నిరసన తెలిపారు.