నిర్మల్ టౌన్, డిసెంబర్ 20: సకల జీవకోటికి గాలి తర్వాత అత్యవసరం నీరే. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భూగర్భజలాల సంరక్షణకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయి. భూమిలో నీరు ఇంకేలా పెద్ద ఎత్తున చెక్డ్యాంలు, ఇంకుడుగుంతలు, మొక్కల పెంపకం వంటివి చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భూగర్భజలాల లెక్కింపునకు కొత్త సాంకేతికతను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. గతంలో భూగర్భజలాలను నెలకొకసారి లెక్కించేందుకు ఫిజియోమీటర్లను వినియోగించుకునేవారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 124 ఫిజియోమీటర్ల ద్వారా భూగర్భజలాల లెక్కింపు నిర్వహించగా, గతేడాది నుంచి వాటి స్థానంలో డిజిటల్ వాటర్ లెవల్ రికార్డు (డీడబ్ల్యూఎల్ఆర్) మిషన్లను ఏర్పాటు చేస్తోంది. ఆదిలాబాద్లో 26, నిర్మల్లో 42, మంచిర్యాలలో 25, కుమ్రంభీం ఆసిఫాబాద్లో 31 ఫిజియోమీటర్లుండగా.. ఆదిలాబాద్లో ఇప్పటివరకు 9, నిర్మల్లో 19, కుమ్రంభీం ఆసిఫాబాద్లో 7, మంచిర్యాల జిల్లాలో 8 చోట్ల డిజిటల్ మీటర్లు ఏర్పాటు చేసినట్లు భూగర్భజలాశాఖాధికారులు పేర్కొంటున్నారు. కేంద్రాల్లో వచ్చే ఏడాది మార్చి వరకు ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
భూగర్భజలశాఖాధికారులు గతంలో ప్రతినెలా 28 నుంచి 31వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలో ఏర్పాటుచేసిన ఫిజియోమీటర్ల వద్దకు వెళ్లి టేపు సహాయంతో భూగర్భ జలాలను లెక్కించి ప్రభుత్వానికి నివేదిక అందించేవారు. కొత్తగా డిజిటల్ వాటర్ రికార్డు మిషన్లను ఏర్పాటు చేసేందుకు స్కాన్ ఇంటర్నేషనల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కో మీటరుకు రూ. లక్ష వరకు ఖర్చు అవుతున్నది. టెలిమెట్రీలు అమర్చడం వల్ల శాటిలైట్ సిగ్నల్ ఆధారంగా ఇవి పనిచేస్తాయి. ఫిజోమీటర్ల ద్వారా ఏర్పాటు చేసిన సెన్సార్ల ద్వారా రియల్టైమ్ డాటా అక్విజేషన్ సిస్టమ్ (ఆర్టీడిఎస్) సాయంతో భూగర్భజలాలను కొలువనున్నారు.. ఆ మిషన్ ద్వారా భూగర్భజలశాఖాధికారులు నెట్ సహాయంతో ప్రభుత్వ కార్యాలయాల్లోనే లొకేషన్ ద్వారా భూగర్భజల నీటిమట్టాన్ని తెలుసుకునే అవకాశం ఉంది. దీనివల్ల సమయం వృథా కాకుండా పక్కగా నీటి లెక్కలు తేలిపోనున్నాయని భూగర్భజలశాఖాధికారులు పేర్కొంటున్నారు. కాగా, నిర్మల్లో ఖానాపూర్, దిలావర్పూర్, కడెం, పెంబి, భైంసా, కుంటాల, లోకేశ్వరం, ముథోల్, తానూరు, నిర్మల్, కుభీర్, బాసర, సోన్, మంచిర్యాల జిల్లాలోని జన్నారం, భీమారం, మంచిర్యాల, తపాలాపూర్, కొండాపూర్, ఆదిలాబాద్లోని గాదిగూడ, బేల, రోల్మామడ, అర్జున, నర్సాపూర్, ఇచ్చోడతో పాటు ఆసిఫాబాద్లో ఈ మిషన్లను ఏర్పాటు చేశారు.
జిల్లాలో పుష్కలంగా భూగర్భజలాలు…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న నీటి వనరుల అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో భూగర్భజలాలు గణనీయంగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా జిల్లాలో ఇటీవల భూగర్భజలాల నిల్వ, వినియోగం, మిగులు జలాలను లెక్కించగా.. అన్ని జిల్లాలో నిల్వ కంటే మిగులు జలాలే అధికంగా ఉన్నట్లు నివేదికలో పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 73,665 హెక్టా మీటర్లలో నీరు ఉండగా.. 18091హెక్టా మీటర్లు వినియోగిస్తుండగా.. 48234 హెక్టా మీటర్లు మిగులు జలాలుగా ఉన్నట్లు గుర్తించారు. మంచిర్యాలలో 88,469 హెక్టా మీటర్లకుగాను 20741 హెక్టా మీటర్లు వినియోగిస్తుండగా.. 59736 హెక్టామీటర్లు మిగులు జలాలుగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
కుమ్రంభీం జిల్లాలో 55023 హెక్టా మీటర్లకు గాను 7438 హెక్టా మీటర్లు వినియోగిస్తుండగా.. 42716హెక్టా మీటర్లు మిగులు జలాలు ఉన్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. నిర్మల్లో 54519 హెక్టా మీటర్లకు గాను 17921హెక్టా మీటర్లు వినియోగిస్తుండగా.. 31248 హెక్టా మీటర్లు మిగులు జలాలుగా ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కొత్త సెన్సర్ విధానం వల్ల ప్రతిరోజు నాలుగుసార్లు లెక్కించే అవకాశం ఉండడంతో, ఎక్కడైనా నీటిని ఎక్కువగా వినియోగిస్తే అక్కడ భూగర్భ జలాల సంరక్షణకు ముందస్తు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా రైతులు సాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని ఎక్కువగా వినియోగిస్తుంటారు. భూగర్భజలాలను పొదుపుగా వినియోగించుకునేందుకు వీలుగా ఆరుతడి పంటల సాగుపై దృష్టిపెట్టే విధంగా ఆయా ప్రాంతాల్లో అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది.
కచ్చిత లెక్కింపునకు డిజిటల్ రికార్డు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భూగర్భజలాల లెక్కింపును పక్కాగా నిర్వహించేందుకు డిజిటల్ మీటర్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక ఫిజియోమీటర్ల ప్రదేశాల్లో కొత్త డిజిటల్ మీటర్లు ఏర్పాటు చేశాం. ఇప్పటికే 50 శాతం డిజిటల్ వాటర్ లెవల్ మిషన్లను ఏర్పాటు చేయడం వల్ల ఆరు గంటలకోసారి నీటి లెక్కింపు కార్యాలయంలోనే తెలుసుకోగలుగుతున్నాం. గతంలో ఫీల్డ్కు వెళ్లి వాటర్ లెక్కించే ఇబ్బంది కూడా తొలగిపోయింది. – శ్రీనివాస్బాబు, భూగర్బజలశాఖాధికారి