హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): వచ్చే ఆర్థిక సంవత్సరం చివరినాటికి ప్రతి మున్సిపాలిటీకి మాస్టర్ ప్లాన్, డిజిటల్ డోర్ నంబర్లను ఏర్పాటు చేస్తామని, ప్రతి పట్టణంలోనూ ఎఫ్ఎస్టీపీలు, మాడ్రన్ ధోబీఘాట్లను అందుబాటులోకి తెస్తామని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లుగా ముందుకువెళ్తున్నాయని అన్నారు. శనివారం అసెంబ్లీలో మున్సిపల్ శాఖకు సంబంధించి పద్దుపై చర్చ అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో పట్టణీకరణ శరవేగంగా జరుగుతున్నదని, ఇందుకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలే కారణమని తెలిపారు. పట్టణాలు ఆర్థిక చోదక శక్తులుగా మారాయని, రాష్ట్రంలోని పట్టణాల నుంచే 70-75 శాతం జీఎస్డీపీ వస్తున్నదని వెల్లడించారు. పట్టణాలు అభివృద్ధి చెందాలని, వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రాష్ట్రంలోని ప్రతి పట్టణంలో ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేస్తామని వివరించారు. ప్రతి పట్టణాన్ని ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దేందుకు, ప్రజలను సంతృప్తి పర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పట్టణాలను గబ్బు పట్టిస్తే సబ్బుతో కడిగే ప్రయత్నం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. రాజకీయ వివక్ష లేకుండా టీయూఎఫ్ఐడీసీ నుంచి నిధులు విడుదల చేశామని, 24 గంటల నాణ్యమైన కరెంట్, అధికార వికేంద్రీకరణ, టీఎస్ఐపాస్, టీఎస్బీపాస్ లాంటి వాటితో పట్టణీకరణ వేగం పుంజుకొన్నదని తెలిపారు. రాబోయే 7-10 ఏండ్లలో గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ జనాభా ఎక్కువ కాబోతున్నదని వెల్లడించారు.
నూతన మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చి పట్టణాల రూపురేఖలు మార్చామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇండ్లకు త్వరితగతిన అనుమతులు ఇవ్వడానికి టీఎస్బీపాస్, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ, ఆస్తుల ఆటో మ్యుటేషన్ వంటి వినూత్న విధానాలను చేపట్టామని వెల్లడించారు. పట్టణ ప్రగతి ద్వారా పట్టణాలకు 2020 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు రూ.3,206 కోట్లు విడుదల చేశామని చెప్పారు. జీహెచ్ఎంసీ మినహా ఇతర పట్టణాలకు రూ.1,559.72 కోట్లు ఇచ్చామని చెప్పారు. 2022-23 బడ్జెట్లో రూ.697 కోట్లు కేటాయించామని వివరించారు. కరోనాలోనూ పట్టణాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని నిధుల విడుదల ఆపలేదని స్పష్టం చేశారు. టీయూఎఫ్ఐడీసీ ద్వారా రాష్ట్రంలో రూ.3,809.07 కోట్ల విలువైన పనులకు అనుమతులు ఇచ్చామని పేర్కొన్నారు. వీటిలో 930 పనులు పూర్తి అయ్యాయని, 741 పనులు కొనసాగుతున్నాయని, మరో 1,257 పనులు మంజూరు, టెండర్ దశల్లో ఉన్నాయని వివరించారు. టీడీఆర్ ద్వారా బ్యాంకును క్రియేట్ చేశామని, దీన్ని నీతిఅయోగ్ ప్రశంసించిందని గుర్తు చేశారు.
రాష్ట్రంలో 71 పట్టణ స్థానిక సంస్థల్లో రూ.250 కోట్లతో ఎఫ్ఎస్టీపీలను ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. వీటిలో 15 పూర్తయ్యాయని, మరో 56 నిర్మాణాలు కొనసాగుతున్నాయని అన్నారు. మిగిలిన 70 పట్టణ స్థానిక సంస్థల్లో రూ.187 కోట్లతో ఎఫ్ఎస్టీపీలు మంజూరు చేశామని, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు దేశంలో 100 శాతం ఎఫ్ఎస్టీపీ ఉన్న రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దబోతున్నామని ప్రకటించారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఒకే దగ్గర కూరగాయలు, పండ్లు, పూలు, మాంస ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఇంటిగ్రెటెడ్ వెజ్, నాన్వెజ్ మార్కెట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 2022-23 బడ్జెట్లో రూ.400 కోట్లు కేటాయించామని, వచ్చే ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా అన్ని మార్కెట్లు ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా నిర్మాణ పనులు జరుగుతున్నతాయని స్పష్టం చేశారు. వైకుంఠధామాల నిర్మాణానికి ప్రస్తుత బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించామని చెప్పారు. కొత్త మున్సిపల్ చట్టంలో గ్రీనరికి 10 శాతం నిధులు కేటాయించాలని నిబంధన విధించామని, 2021-22లో రూ.640 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు. వీటి ద్వారా 2,380 పట్టణ ప్రకృతి వనాలు, 122 బృహత్ పట్టణ ప్రకృతి వనాలు, 1,602 నర్సరీలు, పట్టణ ఉద్యానవనాలు ఏర్పాటు చేశామని వివరించారు.
కేంద్రం అందమైన నినాదాలు ఇస్తుందని, అమలు మాత్రం ఉండదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. మేకిన్ ఇండియా, స్మార్ట్సిటీలంటూ చెప్తారని.. కార్యాచరణకు నిధులు ఉండవని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలించిన 50 ఏండ్లలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని, తెలంగాణ ఏర్పడిన అతితక్కువ కాలంలోనే కాంగ్రెస్ కంటే ఎక్కువ పనులు చేశామని పేర్కొన్నారు. కాళేశ్వరం, కొండపోచమ్మసాగర్, మల్లన్నసాగర్తో తాగు, సాగునీటి సమస్యను తీర్చామని స్పష్టం చేశారు. ఎస్ఆర్డీపీలో భాగంగా ఇప్పటి వరకు రూ.5,514 కోట్ల పనులు పూర్తి చేశామని తెలిపారు. రూ. 37వేల కోట్ల అంచనాలు చేశామని, రూ.3,100కోట్ల పనులు చేపట్టబోతున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో మూడు సార్లు కార్మికుల వేతనాలు పెంచామని చెప్పారు. 64,556 డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తయ్యాయని వివరించారు. వాటిని వచ్చే నెల నుంచి లబ్ధిదారులకు అందజేస్తామని ప్రకటించారు. తెలంగాణ పట్టణాలకు అనేక అవార్డులు వచ్చాయని, ఇది ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని పేర్కొన్నారు.
చిన్నప్పుడు తాను స్కూల్కు బస్సులో వెళ్లినప్పుడు చాలా సార్లు ఆలస్యమయ్యేదని, దానికి కారణం మల్లు భట్టివిక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్సే కారణమని కేటీఆర్ అన్నారు. ఎర్రమంజిల్ నుంచి ఆబిడ్స్లోని స్కూల్కు వెళ్లేప్పుడు ఖైరతాబాద్ జలమండలి వద్ద నీటి కోసం ధర్నాలు, నీటియుద్ధాలు జరిగేవని, దాంతో ట్రాఫిక్ జామ్ అయ్యి స్కూల్కు లేటుగా వెళ్లాల్సి వచ్చేదని చెప్పారు. కేటీఆర్ చెప్పిన సమాధానంతో అసెంబ్లీలో ఒక్కసారిగా నవ్వులు విసిరాయి. నీటి యుద్ధాలు లేకుండా సీఎం కేసీఆర్ నీటి సమస్యను తీర్చారని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి ప్రతి పట్టణంలో ప్రతి ఇంటికి శుద్ధిచేసిన నీటిని అందించేందుకు రూ.6,578 కోట్లతో 141 పట్టణాల్లో అర్బన్ భగీరథ పనులు చేపట్టామని వెల్లడించారు. 11.80 లక్షల నల్లా కనెక్షన్లు అందించామని, ప్రతి వ్యక్తికి ప్రతి రోజు 150 లీటర్ల తాగునీటిని సరఫరా చేస్తున్నామని తెలిపారు. 2022-23 బడ్జెట్లో రూ.800 కోట్లు కేటాయించామని అన్నారు. అర్బన్ భగీరథలో 279 మిలియన్ లీటర్ల సామర్థ్యంతో 61 స్టోరేజీ రిజర్వాయర్లను నిర్మించామని, రూ.1,820 కోట్లతో 2,100 కిలోమీటర్ల కొత్త పైప్లైన్లు వేశామని పేర్కొన్నారు. కృష్ణా నది నుంచి నీటి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సుంకిశాల ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1,450 కోట్లతో రూపొందించామని చెప్పారు. 2022-23లో రూ.725 కోట్లు కేటాయించామని అన్నారు.