హైదరాబాద్ /ఉస్మానియా యూనివర్సిటీ జనవరి 1 : సమైక్య పాలకుల నిర్లక్ష్యంతో మురికి కూపంలా మారిన మన మూసీనదికి ఎంతో ఘనమైన చారిత్రక ప్రాశస్త్యం ఉన్నది. ఎన్నో ఔషధ గుణాలున్న మొక్కలను స్పృశిస్తూ సాగే ఈ జీవనది వజ్రాల గని అని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గతంలోనే తేల్చింది. తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) భూభౌతిక శాస్త్ర అధ్యాపకులు జరిపిన సర్వేలోనూ ఇదే విషయం వెల్లడైంది. మూసీ-కృష్ణా నదుల సంగమ ప్రాంతంలో వజ్రాలతో కూడిన కింబర్లైట్ శిలలు ఉన్నట్టు వారు గుర్తించారు. ఇందుకు చారిత్రక ఆనవాళ్లు కూడా ఉన్నాయని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఓయూ భూభౌతిక శాస్త్ర విభాగ మాజీ అధిపతి ప్రొఫెసర్ జీ రాందాస్ చెప్తున్నారు. మూసీ ప్రవాహ మార్గంలోని భూమి పొరల్లో చోటుచేసుకున్న అనేక మార్పులతో ఈ నది ప్రవాహ దిశ మారినట్టుగా కూడా గుర్తించామని తెలిపారు. భీమా-కృష్ణా, తుంగభద్ర-కృష్ణా సంగమ ప్రాంతాల్లోనూ పలు చోట్ల కింబర్లైట్ శిలలు ఉన్నట్టు తేలిందని స్పష్టం చేశారు. ప్రొఫెసర్ రాందాస్తోపాటు ఓయూ అధ్యాపకులు కే కిశోర్, జీ ఉదయలక్ష్మి నిర్వహించిన ఈ సర్వేలో అనేక ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి.
అధ్యయన నివేదికలోని కొన్ని ప్రధానాంశాలు
మూసీ సంగమ ప్రాంతంలో భారీగా వజ్రాలు
మూసీ నది జన్మస్థలమైన అనంతగిరి ప్రాం తం వాస్తవానికి భీమా బేసిన్లోకి వస్తుందని, మూసీ నదికి సంబంధించిన సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయని ప్రొఫెసర్ రాం దాస్ తెలిపారు. ఈ ప్రాంతంలోనూ రింగ్ టైప్ నిర్మాణాలను గుర్తించామని, పూర్వం ఇక్కడ వ జ్రాల మైనింగ్ జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయని చెప్పారు. యాదాద్రి-భువనగిరి జిల్లా పరిధిలోని ఏదులాబాద్ వద్ద మూసీ ప్రవాహ దిశ మారిన ప్రాంతం నుంచి కృష్ణాలో కలిసే వరకు 5 కిలోమీటర్ల మేర భూమి పైకిలేచినట్టుగా ఉండటాన్ని గుర్తించామని, ఈ పరిధిలోనే భారీ ఎత్తున వజ్రాలు ఉన్నట్టు తేలిందని వివరించారు.