అమ్మో రూ. 6,710 కోట్లు..
తూచ్ రూ. 16.72 కోట్లే..
కాదుకాదు రూ.67.13 కోట్లు.
ఐడీబీఐ బ్యాంక్కు సంఘవీ డైమండ్స్ రుణ ఎగవేతల బాగోతం రోజుకో మలుపు తిరుగుతున్నది మరి. అటు బ్యాంకింగ్ రంగం, ఇటు డైమండ్ పరిశ్రమ ఆశ్చర్యపోతున్న ఈ మోసం.. ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
మూడు రోజుల్లో మూడు రకాలుగా చెప్తూ అంకెల గారడీ చేయాల్సిన అవసరం బ్యాంక్కు ఏమున్నది?.. బకాయిలు ఎంతన్న దానిపై ఎందుకు స్పష్టత
కరువైంది?.. బ్యాంక్ నుంచి ఈ రకరకాల ప్రకటనలు ఏమిటి?.. అసలు ఏది నిజం..? ఎందుకీ గందరగోళం?
ముంబై, డిసెంబర్ 21: ఐడీబీఐ బ్యాంక్ను సంఘవీ డైమండ్స్ గ్రూప్ ఎంత మోసం చేసిందన్న దానిపై.. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని మించిన ఆసక్తి నెలకొంటున్నదిప్పుడు. అవును.. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్నది.. బాహుబలి 2లో తెలిసింది. కానీ సంఘవీ డైమండ్స్ బకాయిలు ఎంతన్నది డే3లోనూ స్పష్టత లేకుండాపోయింది మరి. మేము మోసపోయింది అంత.. కాదు ఇంతే.. కాదుకాదు ఇంత అంటూ 72 గంటల్లో మూడు రకాల ప్రకటనలు చేసింది ఐడీబీఐ బ్యాంక్. ఓవైపు కేంద్రం అండ, మరోవైపు కేంద్ర ప్రభుత్వ దిగ్గజ సంస్థ నాయకత్వంలో నడుస్తున్న ఓ బ్యాంక్ నుంచి ఇలాంటి అస్పష్ట ప్రకటనలు.. అది తామిచ్చిన రుణంపైనే అయోమయంలో పడిపోవడం ఇప్పుడు పెద్ద ఎత్తున అనుమానాలకు తావిస్తున్నది. బ్యాంకింగ్, వజ్రాల పరిశ్రమ వర్గాలనూ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
అసలు సంఘవీ గ్రూప్
సంస్థలకు ఐడీబీఐ బ్యాంక్ ఎంత రుణం ఇచ్చింది?.. ఎంత మోసపోయింది?.. బకాయిలు ఎంత ఉన్నాయి?.. అన్నదానిపై అనేక సందేహాలు కలుగుతున్నాయి. గడిచిన 72 గంటల్లో బ్యాంక్ చేసిన ప్రకటనలు గందరగోళంగా ఉన్నాయి. ఓ పెద్ద బ్యాంక్ నుంచి ఇలాంటివి తప్పులు రావడం ఆశ్చర్యంగా ఉన్నది. అసలు నిజం బయటకు రావాలి.
-విశ్వాస్ ఉతగి, అఖిల భారత బ్యాంక్ అధికారుల సంఘం నేత
కొన్నేండ్లుగా సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులకు అండగా ఎల్ఐసీ ఉంటున్నది. అలాంటి ఎల్ఐసీ సొమ్ముతో ఐడీబీఐ బ్యాంక్ను కొన్నారు. ఆ బ్యాంక్ సంగతేమో ఇలా ఉన్నది. దయచేసి సామాన్యుల పొదుపు, నమ్మకాన్ని ఇలాంటి బ్యాంకుల్లో పెట్టుబడుల ద్వారా దెబ్బ తీయవద్దు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నది.
-రఘునాథ్ కుచిక్, భారతీయ కమ్గర్ సేన ప్రధాన కార్యదర్శి