సుపరిపాలకులుగా ఢంకా బజాయించుకొంటున్న మోదీ ప్రభుత్వ హయాంలో మరో భారీ బ్యాంకింగ్ కుంభకోణం బయటపడింది. దీని మూలాలూ గుజరాత్లోనే. సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారులు సంఘవీలు ఐడీబీఐ బ్యాంకుకు 6,710 కోట్ల రూపాయలమేర టోపీ పెట్టినట్టు ఐఏఎన్ఎస్ వార్తా సంస్థ సోమవారం సంచలన కథనాన్ని వెలువరించింది. ఇదే నిజమైతే దేశంలో డైమండ్ వ్యాపారుల కుంభకోణాల్లో ఇది రెండో అతిపెద్ద స్కాం. ఐడీబీఐ బ్యాంక్ మాత్రం తాము నష్టపోయింది 16 కోట్లేనని అంటున్నది. బీమాదారుల కామధేనువు ఎల్ఐసీ, కేంద్ర ప్రభుత్వం ఐడీబీఐ బ్యాంక్కు ఉమ్మడి యజమానులుగా ఉన్నాయి. బ్యాంక్లో 97% వాటా వీటిదే! ఎల్ఐసీ ఐపీవోకు వెళ్లబోతున్న తరుణంలో ఈ స్కాం బయటపడటం గమనార్హం!
ముంబై, డిసెంబర్ 20: మొన్న మామా-అల్లుండ్లు పీఎన్బీని రూ.14,000 కోట్లు దోచేస్తే.. నేడు అన్నదమ్ములు ఐడీబీఐని రూ.6,710 కోట్లు కొల్లగొట్టారు. మోసపోయిన రెండూ ప్రభుత్వ రంగ బ్యాంకులే అవగా, ముంచిన వాళ్లంతా వజ్రాల వ్యాపారులే కావడం గమనార్హం. పీఎన్బీ మోసం మరువకముందే.. ఐడీబీఐనీ ముగ్గురు గుజరాతీ డైమండ్ బ్రదర్స్ దగా చేశారన్న వార్త బయటకు పొక్కింది. ముంబై కేంద్రంగా సూరత్కు చెందిన కీర్తీలాల్ ఆర్ సంఘవీ, చంద్రకాంత్ ఆర్ సంఘవీ, రమేశ్చంద్ర ఆర్ సంఘవీ నడుపుతున్న ప్రముఖ వజ్రాల వ్యాపార సంస్థ సంఘవీ డైమండ్స్.. ఐడీబీఐ వద్ద రూ.6,710 కోట్ల రుణాలు తీసుకుని ఎగవేసింది.
ఐడీబీఐ బ్యాంక్ ముంబై అధికార వర్గాల సమాచారం మేరకు ఈ బకాయిల్లో 1,61,000 డాలర్ల (దాదాపు రూ.1.20 కోట్లు)కుపైగా విదేశీ కరెన్సీ అప్పులూ ఉన్నట్లు తెలుస్తున్నది. డైమండ్ పరిశ్రమకు చెందిన వ్యాపారుల చేతిలో కావచ్చు.. సంస్థ ద్వారా కావచ్చు.. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తర్వాత భారీ స్థాయిలో నష్టపోయిన బ్యాంక్ ఐడీబీఐనే అని బ్యాంకింగ్ వర్గాలు చెప్తున్నాయి. 2018లో మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీలు పీఎన్బీని రూ.14,000 కోట్లు ముంచిన విషయం తెలిసిందే. కాగా, ముంబైలోని సంపన్న ప్రాంతం బాంద్రా కుర్లా కాంప్లెక్స్ ప్రధాన కేంద్రంగా నడుస్తున్న సంఘవీ ఎక్స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్, దాని నాలుగు అనుబంధ సంస్థలు, వీటికి చెందిన 13 మంది (అంతా కుటుంబ సభ్యులే) డైరెక్టర్లు, ప్రమోటర్లు, గ్యారెంటీర్లు.. ఐడీబీఐ బ్యాంక్ నుంచి రుణాలు తీసుకుని ఎగవేసినట్లు చెప్తున్నారు. సూరత్లోని రెండు ఫ్యాక్టరీలు, ముంబైలోని ఓ కార్యాలయం పాత్ర కూడా ఉన్నది.
16.72 కోట్లేనా?
సంఘవీ ఎక్స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ తమ బ్యాంక్కు బకాయి ఉన్న అసలు మొత్తం రూ.16.72 కోట్లేనని ఐడీబీఐ సోమవారం రాత్రి స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. బ్యాంక్కు సంఘవీ గ్రూప్ రూ. 6,710 కోట్లు డిఫాల్ట్ అయినట్లు వెలువడిన వార్తలపై ఐడీబీఐ ఈ వివరణ ఇచ్చింది. సంఘవీ ఎక్స్పోర్ట్స్ బకాయి వున్న అసలు రూ.16.72 కోట్లూ మొండి బకాయిగా (ఎన్పీఏ) మారిందని, ఈ మొత్తానికి తమ ఖాతాల్లో పూర్తిగా కేటాయింపులు జరిపామని, బకాయిల వసూలుకు తగిన చర్యల్ని చేపడుతున్నట్లు వివరించింది.
నోటీసులకు స్పందనే లేదు
బకాయిలకు సంబంధించి రెండు నెలల క్రితం సంఘవీ డైమండ్స్కు దాని డైరెక్టర్లు, ప్రమోటర్లు, గ్యారెంటీర్లకు ఐడీబీఐ నోటీసులు ఇచ్చినా ఫలితం లేకపోయింది. ఎవరి నుంచీ ఎలాంటి స్పందనా రాలేదని సంబంధిత బ్యాంక్ అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలో సదరు సంస్థలు, వ్యక్తులు తమకు బకాయిపడ్డారని, వారితో ఎలాంటి లావాదేవీలు జరుపరాదనీ ఐడీబీఐ బ్యాంక్ బహిరంగ ప్రకటనల్నీ జారీ చేసింది.
ఎల్ఐసీకి నష్టమా?
ఎల్ఐసీ పబ్లిక్ ఇష్యూకు వెళ్తున్న క్రమంలో ఈ ఐడీబీఐ మోసం బయటకు రావడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఒకప్పుడు ప్రభుత్వ సారథ్యంలో ఉన్న ఐడీబీఐ బ్యాంక్.. ఇప్పుడు ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ నాయకత్వంలోకే వచ్చింది మరి. ఐడీబీఐ బ్యాంక్లో ప్రభుత్వ వాటాలను ఎల్ఐసీ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. దీంతో రిజర్వ్ బ్యాంక్ దీన్ని ప్రైవేట్ రంగ బ్యాంక్గా మార్చిన సంగతీ విదితమే. అయితే స్టాక్ మార్కెట్లో మదుపరుల పెట్టుబడులను ఈ స్కాం ప్రభావితం చేయవచ్చన్న అభిప్రాయాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది మార్చిలోగా ఎల్ఐసీ వాటాలను విక్రయిద్దామనుకుంటున్న మోదీ సర్కారు.. ఈ ఆర్థిక సంవత్సరం (2021-22)లో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని దాదాపు చేరుకుంటామన్న విశ్వాసంతో ఉన్నది. అయితే ఇప్పుడు ఈ భారీ మోసంతో మొత్తం సీన్ రివర్స్ అవుతుందేమోనన్న భయాలు కనిపిస్తున్నాయి. ఎల్ఐసీ ఐపీవో విలువ రూ.80వేల కోట్ల నుంచి లక్ష కోట్ల వరకు ఉన్నది.
ముంబై ఆఫీస్ సీజ్
భారత్ డైమండ్ బౌర్స్(బీడీబీ) డైమండ్లను విక్రయిస్తున్న సంఘవీ ఎక్స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్కు బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) గతంలోనే షాకిచ్చింది. రూ.468 కోట్ల రుణ ఎగవేత కేసులో ముంబైలో కంపెనీకి ఉన్న కార్యాలయాన్ని సీజ్ చేసింది. ఈ వందల కోట్ల రుణానికి బీవోఐ కన్షార్టియంగా వ్యవహరిస్తున్నది. సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్చన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ యాక్ట్, 2002 ప్రకారం జనవరి 9, 2018లోనే బీడీబీ ఆఫీస్ను జప్తుచేసింది. రూ.468 కోట్ల రుణాన్ని దేనా, ఐడీబీఐ, బీవోబీ, యూబీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్ బ్యాంకులు సంయుక్తంగా ఈ రుణాన్ని అందించాయి. ఈ రుణాన్ని వసూలు చేయడానికి బీవోఐ ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ సంస్థ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తనఖా పెట్టిన ఆఫీస్తోపాటు ఇతర ఆస్తులను జప్తు చేసుకున్నది.
దేశం నుంచి పరార్ కాకుండా చూడండి!
ఈ స్కాం గురించి విని షాక్ అయ్యాం. సంఘవీల ట్రాక్ రికార్డు ఏం బాగాలేదు. అయినా ఈ విషయాన్ని ఇంతకాలం ఎందుకు దాచారన్నది ఆశ్చర్యకరంగా ఉన్నది. ఎల్ఐసీ అతి త్వరలో ఐపీవోకి వెళ్లనున్నది. ఈ కుంభకోణం వల్ల ప్రజాధనానికి జరిగే నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు.. కేంద్రమా? ఎల్ఐసీనా? ఐడీబీఐ అధికారులా? మామా అల్లుళ్లు చోక్సీ, నీరవ్ మోదీ లాగా సంఘవీలు దేశం వదిలి పారిపోకుండా కేంద్రం వెంటనే చర్యలు చేపట్టాలి.
ఐడీబీఐకి బకాయిపడ్డ సంఘవీ డైమండ్స్ గ్రూప్ సంస్థలు
సంఘవీ ఎక్స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్
సంఘవీ డైమండ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్
సంఘవీ జ్యుయెల్లరీ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్
సంఘవీ స్టార్ రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్
రాయల్ ఎస్టేట్ హోల్డింగ్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్
డైరెక్టర్లు/ప్రమోటర్లు/గ్యారెంటీర్లు