హైదరాబాద్, మార్చి 8, (నమస్తే తెలంగాణ): ఈ-లావాదేవీ (ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్)ల నిర్వహణలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్టు సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడించింది. తెలంగాణలో ప్రతి 1,000 జనాభాకు సగటున 1,38,266 ఈ-లావాదేవీలు జరుగుతున్నట్టు తెలిపింది. ఈ లావాదేవీల్లో ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ర్టాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నట్టు వెల్లడించింది. వ్యవసాయ భూ క్రయ, విక్రయాల రిజిస్ట్రేషన్లు, వారసత్వ బదిలీ, మార్టిగేజ్, నాలా తదితర సేవలను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన ధరణి పోర్టల్పై ప్రతిపక్షాల విమర్శల్లో వాస్తవం లేదని పేర్కొన్నది.
ఏడాదిలోనే 8,52,872 మంది ధరణి పోర్టల్ను వినియోగించుకొన్నట్టు స్పష్టంచేసింది. మొబైల్ఫోన్ల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించే సదుపాయం అందిరావడంతో మీ-సేవ కేంద్రాల్లో లావాదేవీలు తగ్గినట్టు పేర్కొన్నది. మీ-సేవలను అత్యధికంగా 2015-16లో 4.15 కోట్ల మంది వినియోగించుకోగా, 2021-22 లో (సెప్టెంబర్ 2021) ఈ సంఖ్య 1.11 కోట్లకు పడిపోయినట్టు తెలిపింది.
ధరణి పోర్టల్ ద్వారా ఏడాదిలో జరిగిన లావాదేవీలు
సేవలు :సంఖ్య
భూ క్రయ, విక్రయాలు :5,02,281
గిఫ్ట్ డీడ్ :1,58,215
వారసత్వ బదిలీ :72,085
మార్టిగేజ్ :58,285
నాలా బదలాయింపు :29,453
సంస్థల రిజిస్ట్రేషన్లు :26,372