అజ్ఞానాదథవా జ్ఞానాదుత్తమ శ్లోకనామయత్
సంకీర్తితమఘం పుంసో దహేదేధో యథానలః॥ (భాగవతం)
అజ్ఞానంతో గాని, జ్ఞానంతో గాని పవిత్రకీర్తి గల భగవానుని నామ సంకీర్తనం చేయడం వల్ల అతని పాపాలన్నీ ‘నిప్పు’ కట్టెలను కాల్చి బూడిద చేసినట్లుగా భస్మీపటలం అవుతుందని భాగవతం తెలియజేస్తున్నది.
మానవుడు తన మనో వాక్కాయాలతో చేసే పాపపు కర్మలకు తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవడం అత్యంత అవసరం. లేకపోతే, నరకంలో అనేక బాధలు అనుభవించాల్సి వస్తుంది. ఒకసారి ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్లీ పాపాలకు ఒడిగడితే ‘గజస్నానం’లా ప్రాయశ్చిత్తాలు వ్యర్థమవుతాయి. చేసిన పాపాలు తొలగించుకోవడానికి తపస్సు, బ్రహ్మచర్యం, ఇంద్రియ నిగ్రహం, మానసిక స్థిరత్వం, త్యాగం (దానం), సత్యం, శౌచం (బాహ్యాంతర శుచిత్వం), యమం, నియమం అనే తొమ్మిది సాధనలున్నాయి. ఈ సాధనలతో పాపాలు తొలగిపోతాయి కానీ, అంతఃకరణశుద్ధి ఏర్పడదు. ప్రాయశ్చిత్తాలు కూడా కర్మలే కాబట్టి, కర్మల నాశనం కర్మల వల్ల కలుగదు. ప్రతి కర్మలో ఏదో ఒక పాపం ఉండటం వల్ల ప్రాయశ్చిత్తాలు పాపరాశిని పూర్తిగా తొలగించలేవు. అంతేకాకుండా, కలియుగంలో మానవుల చిత్తాలు కలుషితమై ఉండి పాపపు కర్మల (అన్యాయంగా) ద్వారా ఆర్జించిన ద్రవ్యంతో జీవిస్తూ ఉండటం వల్ల, ఆచారవ్యవహారాలు, సంప్రదాయాలు, విధివిధానాలు పూర్తిగా తెలియకపోవడం వల్ల తపస్సు మొదలైన వాటివల్ల సంపూర్ణ ఫలితాలు పొందలేరు.
‘కలౌ కల్మష చిత్తానాం పాపద్రవ్యోప జీవినాం
విధి క్రియా విహీనానాం గతిః గోవింద కీర్తనమ్
కలియుగంలో భగవన్నామ సంకీర్తనమే పరమగతి. అదే అన్నింటికన్నా గొప్ప సాధనం అని మహాత్ములు తెలియజేశారు. ఇతరులను ఉద్దేశించి గాని, పరిహాసానికి గాని భగవంతుడి నామాన్ని ఉచ్చరిస్తే అతని పాపాలు పూర్తిగా పరిహారమవుతాయని, భగవన్నామ సంకీర్తనం అన్నివిధాలుగా చిత్తశుద్ధిని కలిగిస్తుందని, భగవత్ భక్తులు తప్పులు చేసినా పరమాత్మ వారిని క్షమించి ఉద్ధరిస్తాడని, పరమాత్మ భక్తులు ఎప్పుడూ పతనం చెందకుండా ఉంటారని భాగవతం తెలియజేస్తున్నది.
భాగవతంలోని ‘అజామిళోపాఖ్యానం’ భగవన్నామ సంకీర్తనం గొప్పదనాన్ని తెలియజేస్తుంది. అజామీళుడు మంత్రసిద్ధి పొందిన యువకుడు. ఒకసారి ఆయన సంగమిస్తున్న ఓ జంటను చూశాడు. ఆ దృశ్యం చూడగానే కామోద్రేకాలకు లోనయ్యాడు. ఎంత ప్రయత్నించినా తన మనసును ఆ స్త్రీ నుంచి తొలగించుకోలేకపోయాడు. ఆమె పట్ల వ్యామోహం పెంచుకొని తన కుటుంబానికి దూరమయ్యాడు. ఆమెను పోషించడానికి, సంతోషపరచడానికి అనేక పాపాలు చేసి భ్రష్టుడయ్యాడు. ఆమెతో పదిమంది సంతానం కన్నాడు. రోజులు దొర్లిపోయాయి. అజామిళుడు వృద్ధుడయ్యాడు. మరణ సమయం ఆసన్నమైంది. తన చిన్న కుమారుణ్ని పిలిచే ఉద్దేశంతో ‘నారాయణా!’ అని ఒక్కొక్క అక్షరాన్నీ పలుకుతూ మరణించాడు. అజామిళుడిని నరకానికి తీసుకుపోవడానికి యమదూతలు వచ్చారు. మరణ సమయంలో నారాయణ నామం పలకడంతో విష్ణుదూతలూ వచ్చారు. యమదూతలను అడ్డగించి, అజామిళుడిని విష్ణులోకానికి చేర్చారు. పాపాత్ముడైనా అజామిళుడు భగవన్నామ సంకీర్తనం వల్ల వైకుంఠాన్ని పొందాడు. భక్తితో భగవన్నామ సంకీర్తనం చేసే భక్తులకు పరమాత్మ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది.
తస్మాత్ కీర్తనమ్ విష్ణోః జగన్మంగళంమహసామ్
మహతామపి కౌరవ్య విద్ధ్యేకాంతిక నిష్కృతిమ్
భగవన్నామ సంకీర్తనం లోకకల్యాణ కారకం. భగవన్నామ (విష్ణు) సంకీర్తనంతో గొప్పగొప్ప పాపాలను, వాటి వాసనలను కూడా తొలగించుకోవచ్చు. ముక్కోటి పాపాలకూ నిజమైన ప్రాయశ్చిత్తం భగవన్నామ సంకీర్తనమే అని తెలియజేస్తున్నది భాగవతం. పాపాలు చేస్తూ భగవన్నామ సంకీర్తనం చేయడం కాదు. చేసిన పాపాలను తొలగించుకోవడానికి భగవన్నామాన్ని ఆశ్రయించాలని గ్రహించాలి.
-దోర్బల కుమారస్వామి