కాషాయవనంలా అంజన్న సన్నిధి
కొండగట్టు అంజన్న క్షేత్రంలో కిక్కిరిసిన దీక్షాపరులు
“శ్రీ ఆంజనేయం.. ప్రసన్నాంజనేయం.. శ్రీరామ జయరామ.. జయజయ రామ” అంటూ రామనామ స్మరణతో కొండగట్టు క్షేత్రం మార్మోగింది. బుధవారం హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా కొండంతా కిక్కిరిసిపోయింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 1.50 లక్షల మందికిపైగా తరలివచ్చిన దీక్షా పరులతో కాషాయవర్ణ శోభితమైంది. మంగళవారం సాయంత్రానికే పార్కింగ్ స్థలాలన్నీ నిండిపోగా, అధికారుల పకడ్బందీ ఏర్పాట్లతో మాల విరమణ సాఫీగా సాగింది. జయంతి సందర్భంగా ఉదయం నుంచే స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు చేయడం, భద్రాద్రి ఆలయం తరఫున తొలిసారి పంపిన పట్టువస్ర్తాలతో అంజన్న మెరిసిపోవడంతో భక్తజనం తిలకించి పులకించింది.
మల్యాల, మే 25 : హనుమాన్ పెద్ద జయంతిని పురస్కరించుకొని మాలవిరమణ కోసం రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన దీక్షాపరులతో కొండగట్టు బుధవారం కాషాయ వర్ణశోభితమైంది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం వరకు సుమారు 1.50 లక్షలకుపైగా భక్తులు అంజన్నను దర్శించుకున్నట్లు అధికారయంత్రాంగం వెల్లడించింది.
జో అచ్యుతానంద జోజో ముకుందా..
స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించిన అనంతరం, ఊయలలో ఉంచి, ‘జో అచ్యుతానంద జోజో ముకుందా.. లాలి పరమానంద రామ గోవిందా..’ అంటూ ఊపారు. అనంతరం ఉత్సవమూర్తులను యాగశాల నుంచి ఆలయప్రవేశం చేయించారు. మంత్ర పుష్పం, మహానివేదన చేసి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సాయంత్రం స్వామి వారికి ఆరాధన నిర్వహించారు. అనంతరం అమ్మ వారికి కుంకుమార్చన చేసి ఒడి బియ్యం సమర్పించి ఆలయంలో సహస్రదీపాలు వెలిగించారు. తర్వాత స్వామి వారిని గరుడవాహనంపై ఆలయ వీధుల గుండా ఊరేగించారు. చివరగా కంకణోద్వాసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఉదయం 3 గంటల నుంచే ప్రత్యేక పూజలు..
హనుమాన్ పెద్ద జయంత్యుత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు ఉదయం 3 గంటలకే స్వామి వారికి తిరుమంజనం, ద్రావిడ పారాయణాల అనంతరం చందనాలంకరణ చేశారు. అనంతరం స్వామి వారికి బాలభోగం, గిన్నె తీర్థం అందజేశారు. ఉదయం 10 గంటలకు తులసీ అర్చన చేశాక మంగళవాయిద్యాల నడుమ పుష్కరిణి నుంచి బిందెలతో నీరు తెచ్చి స్వామి వారి మూల విరాట్కు అభిషేకం, పంచామృత, క్షీరాభిషేకం చేశారు. సహస్రనాగవల్లి అర్చన చేశారు. యాగశాలలో ఆంజనేయ స్వామి ఉత్సవ మూర్తికి మంగళ స్నానం చేయించారు. తొలిసారిగా భద్రాచలం శ్రీ సీతారామ స్వామి దేవస్థానం వారు అధికారికంగా సమర్పించిన పట్టువస్తాలతో స్వామివారి మూలవిరాట్టును అలంకరించగా, మెరిసిపోయింది.
తండోపతండాలుగా తరలివచ్చిన దీక్షాపరులు..
జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం సాయంత్రం నుంచి భక్తుల సంఖ్య పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్రగా, వాహనాల్లో లక్షలాదిగా గుట్ట దిగువకు చేరుకున్న దీక్షాపరులు చెట్ల కింద సేదదీరి, ఎండ తగ్గుముఖం పట్టగానే గుట్ట మీదికి ఉప్పెనలా తరలిరాగా, జేఎన్టీయూ నుంచి బొజ్జపోతన వరకు ఏర్పాటుచేసిన మూడు వాహన పార్కింగ్ స్థలాలు, గుట్ట కింద వాహన పార్కింగ్ స్థలం రాత్రి వరకే వాహనాలతో పూర్తిగా నిండిపోయాయి. మాలధారులు మండల, అర్ధమండల, 11రోజుల దీక్ష విరమించి, పుష్కరిణిలో స్నానం చేశారు. అనంతరం స్వామి వారిని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి బుధవారం రాత్రి వరకు దీక్షావిరమణ కార్యక్రమం సాఫీగా సాగింది. హైదరాబాద్కు చెందిన శ్రీదర్ యాదవ్ అనే వ్యక్తి మూడు రోజుల పాటు నిత్యాన్నదానం చేసి, లక్ష నీటి ప్యాకెట్లను భక్తులకు ఉచితంగా అందజేశారు. వీరితో పాటు బీఎస్ఎన్ఎల్ సంస్థ ఉద్యోగులు కూడా మంచినీరు సరఫరా చేసి, ఉదారత చాటుకున్నారు. గుట్టపైన బస్టాండ్లో, 20 గదుల ధర్మశాలలో వివిధ టికెట్, ప్రసాద విక్రయ కేంద్రాలు నిరంతరాయంగా నడవడంతో ఎలాంటి ఇబ్బందులూ ఎదురుకాలేదు.
సీసీ కెమెరాలు ప్రారంభం..
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆలయంలో కలెక్టర్ గుగులోత్ రవి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాగశాలలో హోమ మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో భద్రత నిమిత్తం ఏర్పాటు చేసిన 50 సీసీ కెమెరాలను జగిత్యాల ఎస్పీ సింధూశర్మతో కసి పోలీస్ ఔట్ పోస్ట్లో ప్రారంభించారు. ఇక్కడ జగిత్యాల అదనపు ఎస్పీ రూపేశ్కుమార్, జగిత్యాల డీఎస్పీ ప్రకాశ్, ఆర్డీవో మాధురి, మల్యాల తహసీల్దార్ సుజాత, సీఐ రమణమూర్తి, ఎస్ఐ వంగ పురుషోత్తం, ఈవో టంకశాల వెంకటేశ్ పాల్గొన్నారు.
పకడ్బందీ బందోబస్తు..
జగిత్యాల ఎస్పీ సింధూశర్మ, అదనపు ఎస్పీ రూపేశ్కుమార్ నేతృత్వంలో జగిత్యాల, మెట్పల్లి డీఎస్పీలు ప్రకాశ్, వంగ రవీందర్రెడ్డి, మల్యాల సీఐ రమణమూర్తి, మల్యాల ఎస్ఐ వంగ పురుషోత్తం తమ సిబ్బందితో కలిసి భక్తులు అధికంగా ఉండే ప్రాంతాల్లో పకడ్బందీ బందోబస్తు చేపట్టారు. మాల విరమణ, కేశఖండనం, దర్శనం, ప్రసాదాల కొనుగోలు చేసుకొని స్వామివారిని దర్శించుకొని తిరిగి వెళ్లారు.
టికెట్, ప్రసాద విక్రయ కౌంటర్ల వద్ద బారులు..
గుట్టపై బస్టాండ్ వద్ద 20 గదుల ధర్మశాల, బస్టాండ్ వద్ద వివిధ టికెట్ విక్రయ కేంద్రాలు, ప్రసాద విక్రయ కేంద్రాలు నిరంతరాయంగా నడిచాయి. ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్, పాలకమండలి చైర్మన్ తిరుక్కోవెల మారుతీస్వామీ, ఏఈఓ బుద్ది శ్రీనివాస్, సూపరింటెండెంట్లు శ్రీనివాస శర్మ, సునీల్, ఆలయ ఏఈ లక్ష్మణ్రావు, సీనియర్ అసిస్టెంట్లు కే శ్రీనివాసాచారి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రాజేశ్వర్రావు, సంపత్ సిబ్బంది జెమిని శ్రీనివాస్, ధర్మేందర్, సుధాకర్రెడ్డి భక్తులకు కావాల్సిన ఏర్పాట్లను పర్యవేక్షించారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
ఆలయ సీనియర్ అసిస్టెంట్, జాతీయ అవార్డు గ్రహీత కే శ్రీనివాసచారి ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. రామాయణం, చిరుతల రామాయణం, చిందు యక్షగానం, గీతాలాపన, చిన్నారుల సంప్రదాయ నృత్య రూపాలు ఆకట్టుకున్నాయి.
ఎమ్మెల్సీ కవిత తరఫున పట్టువస్ర్తాలు
స్వామివారి కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రత్యేకంగా పట్టువస్ర్తాలను పంపించారు.ఆమె తరఫున అధికారులకు ఆలయ పాలకమండలి చైర్మన్ తిరుక్కోవెల మారుతీస్వామీ, స్థానిక సర్పంచ్ బద్దం తిరుపతిరెడ్డి, హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ సభ్యులు దావ సురేశ్, జాగృతి నాయకులు పసుల చరణ్ ప్రత్యేకంగా ఆలయానికి తీసుకువచ్చి స్వామివారికి అలంకరింపజేశారు.