శ్రీశైలం : అష్టాదశ శక్తి పీఠం, ద్వాదశ జ్యోతిర్లింగమైన శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా కనిపించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరాధి రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్న భక్తులు స్వామి, అమ్మవార్ల దర్శనం కోసం క్యూలైన్లలో బారులుదీరారు. కొవిడ్ నేపథ్యంలో నివారణ చర్యలను పాటిస్తూ, మాస్క్లు ధరించిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి ఇచ్చినట్లు ఈఓ లవన్న పేర్కొన్నారు. శీఘ్ర, వీఐపీ బ్రేక్ టిక్కెట్లు తీసుకున్న భక్తులకు స్పర్శ దర్శనం కల్పించగా, శీఘ్ర దర్శనం భక్తులకు స్వామిఅమ్మవార్ల అలంకార దర్శనాలు చేసుకునేందుకు సుమారు మూడు గంటల సమయం పట్టిందని ఆలయ అధికారులు తెలిపారు.
ఆర్జిత సేవలు, పరోక్ష సేవలు ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నవారు స్వామి అమ్మవార్ల సేవలో పాల్గొన్నారు. క్యూలైన్లలో భక్తులు వేచి ఉండే సమయంలో అల్పాహారం, మంచినీరు, పాలు, మజ్జిగ అందించినట్లు ఈఓ పేర్కొన్నారు. క్లాక్రూం, ప్రసాద విక్రయ కేంద్రాలు, ఫ్రీ క్యూలైన్లలో ఈఓ పర్యటించి యాత్రికులతో నేరుగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆలయ భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని ఏ ఒక్కరూ కూడా సెల్ఫోన్లను ఆలయంలోనికి తీసుకువెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు. ఆదివారం ఉదయం ఒక్కసారిగా ఆలయానికి భారీగా వాహనాలు చేరుకోగా పార్కింగ్కు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహారెడ్డి ప్రత్యేకంగా సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసి ట్రాఫిక్ను నియంత్రించారు.